3రోజుల 8 గంటల సీఎంగా ఫడ్నవీస్: మూడురోజుల ముఖ్యమంత్రుల జాబితా ఇదే..!
ఒక్క రాత్రిలో మహారాష్ట్ర రాజకీయాలు మలుపులు తీసుకున్నాయి. కొన్ని గంటల్లో అదే రాజకీయాలు తిరిగి యూటర్న్ తీసుకున్నాయి. గంట గంటకు మహారాష్ట్ర రాజకీయాల్లో మార్పులు శరవేగంగా చోటుచేసుకున్నాయి. ఫలితం నాలుగు రోజులకే ముఖ్యమంత్రిగా సీఎం ఫడ్నవీస్ రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో దేశంలో అత్యల్పకాలంగా ముఖ్యమంత్రిగా పనిచేసిన వారి జాబితాలోకి దేవీంద్ర ఫడ్నవీస్ పేరు చేరింది.

మలుపులు తిరిగిన మహా రాజకీయం
రాజకీయాల్లో ఏ క్షణం ఎలాంటి మలుపు తీసుకుంటుందో ఊహించడం కష్టం. అప్పటి వరకు బద్ధ శతృవులుగా ఉన్నవారు ఒక్కసారిగా భుజాలపై చేతులు వేసుకుని కలిసి నడుస్తారు. అప్పటి వరకు క్లోజ్ ఫ్రెండ్స్గా ఉన్న పార్టీలు ఒక్కసారిగా గుడ్బై చెప్పి మరో పార్టీతో జతకట్టేందుకు సిద్ధమవుతుంది. ఇలాంటి పరిణామాలే మహారాష్ట్ర రాజకీయాల్లో ఆవిష్కృతమవుతున్నాయి. తెల్లారితే ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ను కలవాల్సి ఉండగా ఒక్కసారిగా మహావికాస్ కూటమికి షాకిస్తూ దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం, డిప్యూటీగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ ప్రమాణస్వీకారం చేయడం జరిగిపోయాయి. ఆ తర్వాత మేటర్ సుప్రీంకోర్టుకు చేరిపోవడం, మూడురోజుల పాటు సుప్రీంకోర్టులో వాదనలు ఆపైన తీర్పు రావడం జరిగింది.

సుప్రీం తీర్పుతో శరవేగంగా మారిన పరిణామాలు
ఇక మంగళవారం సుప్రీంకోర్టు తీర్పు వచ్చాక మళ్లీ మహార రాజకీయాలు వేడెక్కాయి. నవంబర్ 29న లోగా బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ ఫడ్నవీస్కు సమయం ఇవ్వగా సుప్రీంకోర్టు మాత్రం బుధవారానికే బలనిరూపణ జరగాలంటూ ఆదేశాలు ఇచ్చింది. అదికూడా ఓపెన్ బ్యాలట్ విధానంలో జరగాలని వెల్లడించింది. తీర్పు తర్వాత శరవేగంగా రాజకీయ పరిణామాలు మారాయి. అప్పటి వరకు అజిత్ పవార్పైనే ఆశలు పెట్టుకున్న ఫడ్నవీస్ ఒక్కసారిగా కుటుంబ సభ్యుల ఒత్తిడితో డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయడంతో పరిస్థితులు మారిపోయాయి. ఆ తర్వాత గంటకే ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

మూడు రోజుల పాటు సీఎంగా యడియూరప్ప జగదాంబిక పాల్
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక దేవేంద్ర ఫడ్నవీస్ అక్టోబర్ 23న మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే శివసేన పక్కకు జరగిపోవడంతో అక్టోబర్ 26న రాజీనామా చేశారు. అప్పటి వరకు కర్నాటక సీఎంగా యడియూరప్ప, ఉత్తర్ ప్రదేశ్ సీఎంగా జగదాంబిక పాల్లు మాత్రమే మూడు రోజులు పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అంతకుముందు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ఐదేళ్ల పాటు అంటే 2014 నుంచి 2019 వరకు పూర్తిస్థాయిలో ముఖ్యమంత్రిగా పనిచేశారు.

మూడు రోజుల పాటు యడియూరప్ప సీఎం
ఇక కర్నాటక విషయానికొస్తే 2018, మే 17న యడియూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఈక్వేషన్స్ కుదరకపోవడంతో మే 19న రాజీనామా చేశారు. ఇక అప్పటికే యడియూరప్ప మూడుసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే కర్నాటకలో కుమారస్వామి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కావడం, 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ఈ ఏడాది జూలైలో ఆ ప్రభుత్వం పడిపోయింది. తర్వాత యడియూరప్ప తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. మొత్తానికి కర్నాటక చరిత్రలో ఒక వ్యక్తి నాలుగు వేర్వేరు సమయాల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రికార్డు ఒక్క యడియూరప్పకే దక్కుతుంది.

జగదాంబికా పాల్ కూడా మూడురోజుల ముఖ్యమంత్రే
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగదాంబికా పాల్ మూడురోజుల పాటు ఉన్నారు. 1988 ఫిబ్రవరి 21 నుంచి 1988 ఫిబ్రవరి 23 వరకు ఆయన సీఎంగా బాధ్యతలు అప్పగించారు. కళ్యాణ్ సింగ్ను అప్పటి గవర్నర్ రొమేష్ భండారీ తొలగించిన తర్వాత పాల్ ప్రమాణస్వీకారం చేశారు. తనను తప్పించడం అన్యాయమని పేర్కొంటూ సుప్రీంకోర్టుకు వెళ్లగా బలనిరూపణ చేసుకోవాల్సిందిగా కోర్టు ఆదేశించింది. దీంతో బలనిరూపణలో కళ్యాణ్ సింగ్ విజయం సాధించి తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.












Click it and Unblock the Notifications