బిజెపి గేమ్ ప్లాన్: రజనీపై కమలం వల, కాలాపై అమృత ఆసక్తికరవ్యాఖ్యలు
తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ ను తనవైపును తిప్పుకొనేందుకుగాను బిజెపి తన ప్రయత్నాలను విరమించుకోలేదు. దక్షిణాదిలో తన బలాన్ని పెంచుకొనేందుకుగాను బిజెపి ప్రతి చిన్న అవకాశాన్ని వదులుకోవడానికి సిద్దంగా లేదు.
చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ ను తనవైపును తిప్పుకొనేందుకుగాను బిజెపి తన ప్రయత్నాలను విరమించుకోలేదు. దక్షిణాదిలో తన బలాన్ని పెంచుకొనేందుకుగాను బిజెపి ప్రతి చిన్న అవకాశాన్ని వదులుకోవడానికి సిద్దంగా లేదు. రజనీకాంత్ ను మహరాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత కలిశారు. సమాజంలో నెలకొన్న సమస్యలపై చర్చించామని అమృత ట్వీట్ చేశారు.
రాజకీయాల్లోకి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వస్తారనే ప్రచారం సాగుతోంది. ఇటీవల ఆయన అభిమానసంఘాలతో సమావేశం కావడం కూడ ప్రాధాన్యతను సంతరించుకొంది.
రజనీకాంత్ రాజకీయరంగ ప్రవేశం చేస్తారనే వార్తలు రావడంతో ఆ రాష్ట్రంలో రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకొంటున్నాయి. తమిళ సంఘాలు రజనీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాయి.
స్థానికేతరుడంటూ రజనీపై దుమ్మెత్తిపోశాయి. అయితే ఈ వ్యాఖ్యలను రజనీకాంత్ అభిమానులు తీవ్రంగా ఖండించారు. అంతేకాదు ఆయన రాజకీయాల్లోకి రావాలంటూ అభిమానులు కూడ ర్యాలీలు నిర్వహించారు.

రజనీతో అమృత ఏం మాట్లాడారు?
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తో మహరాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత సమావేశమయ్యారు.ఈ మేరకు ఆమె ఈ విషయాన్ని ట్విట్టర్ లో స్వయంగా ట్వీట్ చేశారు. ముంబైలో కాలా చిత్రం షూటింగ్ సందర్భంగా ఆమె రజనీకాంత్ ను కలుసుకొన్నారు.సమాజంలో నెలకొన్న పరిస్థితులు, సమస్యలు, వాటి పరిష్కారాలపై చర్చించామని ఆమె ట్వీట్ చేశారు.

అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్న బిజెపి
దక్షిణాది రాష్ట్రాల్లో తన బలాన్ని పెంచుకొనేందుకు బిజెపి ప్రయత్నాలను చేస్తోంది.ఈ మేరకు దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడులో ప్రముఖ సినీనటుడు రజనీకాంత్ ను తమ పార్టీలో చేర్చుకొంటే రాజకీయంగా ప్రయోజనం కలుగుతోందనే అభిప్రాయం బిజెపిలో ఉంది.ఈ మేరకు ఆయనను పార్టీలోకి చేర్చుకోవాలని ప్రయత్నాలను చేస్తోంది. ఆయన కోసం పార్టీ తలుపులు తెరిచే ఉంటాయని బిజెపి జాతీయ నాయకత్వం ప్రకటించింది కూడ. అయితే రజనీకాంత్ ను తమ వైపుకు తిప్పుకొనేందుకు తన ముందున్న ప్రతి అవకాశాన్ని బిజెపి ఉపయోగించుకొంటోంది.

ఇదే సమయం
జయలలిత మరణం తర్వాత తమిళనాడు రాష్ట్రంలో ఇబ్బందికర పరిణామాలు చోటుచేసుకొన్నాయి. అన్నాడిఎంకె ను సమర్థవంతంగా నడిపే నాయకులు లేకుండా పోయారు. పార్టీ మూడు వర్గాలుగా విడిపోయింది. ఇప్పటికే రెండు గ్రూపులుగా విడిపోయింది. మరోవైపు దినకరన్ గ్రూపుగా మరికొందరు ఏర్పడేందుకు సన్నద్దమయ్యారు. ఈ సమయంలోనే రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే ప్రయోజనంగా ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయశూన్యతను భర్తీచేసే అవకాశం ఉంటుందని రజనీ అభిమానులు చెబుతున్నారు.

విజయశాంతి వర్సెస్ రజనీకాంత్
అన్నాడిఎకెంలో శశికళ వర్గంతో విజయశాంతి సన్నిహితంగా మెలుగుతోంది. బెంగుళూరులో జైలులో ఉన్న శశికళను ఆమె కలిశారు. అయితే ఆమె అన్నాడిఎంకెలో చేరుతారనే ప్రచారం కూడ ఉంది.ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు రజనీ రాజకీయాల్లోకి వస్తే విజయశాంతి, రజనీకాంత్ ల మధ్య పోటాపోటీ రాజకీయం నడిచే పరిస్థితులు లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.అయితే వీరిద్దరూ కూడ రాజకీయాలకు సంబంధించి ఇంకా స్పష్టంగా ప్రకటనలు చేయాల్సి ఉంది.












Click it and Unblock the Notifications