బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీకి కరోనా పాజిటివ్: తీవ్రమైన లక్షణాలు, ఈసీకి వినతి
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ ఎంపీ వరుణ్ గాంధీకి కరోనా వైరస్ పాజిటివ్గా నిర్దారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తనకు తీవ్రమైన లక్షణాలున్నాయని చెప్పారు. తన నియోజకవర్గమైన ఫిలిబిత్ లో మూడు రోజులు పర్యటించానని, ఆ సమయంలోనే తనకు వైరస్ సోకి ఉండొచ్చని వరుణ్ గాంధీ తెలిపారు.
వచ్చే నెల నుంచి ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. అభ్యర్థులు, ఎన్నికల ప్రచారంలో పాల్గొనే పార్టీ ముఖ్య కార్యకర్తలకు కరోనా వ్యాక్సిన్ ప్రికాషనరీ డోసులు ఇవ్వాలని ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని వరుణ్ గాంధీ కోరారు. కరోనా థర్డ్ వేవ్ కొనసాగుతున్న సమయంలో ఎన్నికల ప్రచారం చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఇలాంటి చర్యలు అవసరమని ఆయన పేర్కొన్నారు.
కాగా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్లలో మొత్తం 690 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. అన్ని రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు మార్చి 10న ఒకేసారి చేపడతారు. శనివారం ఎన్నికల షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే.
మరోవైపు దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. గడిచిన 24 గంటల్లో లక్షా 60 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ వ్యాప్తి కూడా పెరుగుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో రోజువారి కరోనా పాజిటివిటీ రేటు 10.21 శాతానికి పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
శనివారం ఒక్కరోజే 15,63,566 కరోనా పరీక్షలు నిర్వహించగా.. వారిలో 1,59, 632 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయిందని తెలిపింది. కరోనాతో పోరాడుతూ చికిత్స పొందుతున్న 327 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకూ మృతుల సంఖ్య 4,83,790కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు సంఖ్య 5,90,611కు చేరింది. శనివారం 40,863 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీల సంఖ్య 3,44,53,603కు చేరింది. గడిచిన 24 గంటల్లో 56,91,175 మంది కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 151.58 కోట్ల మందికి వాక్సిన్స్ ఇచ్చినట్లు వివరించింది.