సోషల్ మీడియాలో మైసూరు మహారాణి పేరుతో నకిలీ అకౌంట్, ఫోటోలు షేర్, సైబర్ క్రైం !
సోషల్ మీడియాలో మైసూరు మహారాజు భార్య పేరుతో నకిలీ అకౌంట్ .ఇన్ స్టా గ్రామ్ లో ఫోటోలు, సమాచారం షేర్, మైసూరు మహారాజుకు తెలిసింది.బెంగళూరు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు, నకిలీ అకౌంట్ ఎవరు క్రియేట్ చేశారు
బెంగళూరు: సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్లు ప్రారంభించి సామాన్యులు, యువతులు, మహిళల జీవితాలతో చెలగాటం ఆడుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కాస్త సృతి మించిన కొందరు సోషల్ మీడియాలో ఏకంగా మైసూరు మహారాజు భార్య పేరుతో నకిలీ అకౌంట్ ప్రారంభించి ఫోటోలు షేర్ చేస్తున్నారు.
తన పేరుతో ఇన్ స్టా గ్రామ్ లో ఎలాంటి అకౌంట్ లేదని, తన పేరును దుర్వినియోగం చేసిన వారి మీద చర్యలు తీసుకోవాలని మైసూరు మహారాజు భార్య త్రిషికా బెంగళూరు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్ స్టా గ్రామ్ లో గుర్తు తెలియని వ్యక్తులు మైసూరు మహారాణి త్రిషికా పేరుతో నకిలీ అకౌంట్ ప్రారంభించారని వెలుగు చూసింది.
అనంతరం త్రిషికా, మైసూరు ప్యాలెస్ వివరాలు అందులో పోస్టు చేస్తున్నారు. త్రిషికా పేరుతో అనేక మందికి రిక్వెస్టు పంపిస్తున్నారని ఆ నకిలీ అకౌంట్ ప్రారంభించిన వారి మీద చర్యలు తీసుకోవాలని మైసూరు మహారాణి త్రిషికా వ్యక్తిగత సహాయకులు ( పీఏ) బెంగళూరు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మైసూరు మహారాజు, త్రిషికా భర్త యధువీర్ సైతం సోషల్ మీడియాలో స్పంధించారు. తన భార్య త్రిషికా సోషల్ మీడియాపై పెద్దగా ఆసక్తి చూపించరని అంటున్నారు. త్రిషికా పేరు మీద క్రియేట్ అయిన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ నకిలీదని, అందులోని ఫోటోలు, సమాచారం ఎవ్వరూ షేర్ చెయ్యకూడాదని మైసూరు మహారాజు యధువీర్ సోషల్ మీడియాలో మనవి చేశారు. బెంగళూరు సైబర్ క్రైం పోలీసులు మైసూరు మహారాణి త్రిషికా నకిలీ అకౌంట్ ప్రారంభించిన వారి కోసం గాలిస్తున్నారు.