భారత్పై విషం చిమ్ముతున్న పాకిస్థాన్ యూట్యూబ్ ఛానళ్లు, సైట్లు: నిషేధం విధించిన కేంద్రం
న్యూఢిల్లీ: పాకిస్థాన్ నకిలీ యూట్యూబ్ ఛానల్స్, వెబ్సైట్లతో భారతదేశంపై విషం చిమ్మే ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. భారత్లో ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తున్న 35 యూట్యూబ్ ఛానెల్లు, 2 ట్విట్టర్ ఖాతాలు, 2 ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు, 2 వెబ్సైట్లపై నరేంద్ర మోడీ ప్రభుత్వం నిషేధం విధించింది.
దేశంలో సున్నితమైన అంశాలపై తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేస్తున్నారనే ఆరోపణలతో యూట్యూబ్ ఛానళ్లపై చర్యలు తీసుకుంది కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ. జనవరి 20వ తేదీన మినిస్ట్రీకి అందిన ఇంటెలిజెన్స్ ఆధారంగా పాకిస్థాన్ నుంచి నిర్వహిస్తోన్న ఈ ఛానెళ్ల నుంచి తప్పుడు సమాచారం ప్రసారం అవుతోందని గుర్తించారు.
పాకిస్తాన్ కేంద్రంగా ఈ ఛానెళ్లు పనిచేస్తున్నాయని ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. ఏజెన్సీ సమాచారంతో కేంద్ర మంత్రిత్వ శాఖ ఆయా ఛానళ్లు, వెబ్ సైట్లపై నిషేధం విధించాలని నిర్ణయం తీసుకుంది. ఈ ఛానెళ్ల ద్వారా భారత వ్యతిరేక వార్తలు.. వ్యతిరేక కంటెంట్ను వ్యాప్తి చేస్తున్నాయి. కాశ్మీర్ ఇష్యూ, ఇండియన్ ఆర్మీ, భారతదేశంలోని మైనారిటీ కమ్యూనిటీలు, రామమందిరం, జనరల్ బిపిన్ రావత్ మొదలైన అంశాలపై కంటెంట్ను విద్వేషపూరితంగా పోస్ట్ చేస్తున్నట్లుగా మంత్రిత్వ శాఖ పేర్కొంది.
అంతకుముందు జనవరి 19 న, సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. దేశానికి వ్యతిరేకంగా పనిచేసే "కుట్రదారుల"పై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. ప్రపంచంలోని అనేక పెద్ద దేశాలు ఇటువంటి చర్యలను గుర్తిస్తున్నాయని, భారత్ కూడా ఈ విషయంలో ముందు ఉన్నట్లు స్పష్టం చేశారు. యూట్యూబ్ కూడా వారిని బ్లాక్ చేసేందుకు చర్యలు చేపట్టిందని ఈ సంధర్భంగా వెల్లడించారు. గత డిసెంబర్లో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో సమన్వయంతో కూడిన ప్రయత్నంలో, భారతదేశానికి వ్యతిరేకంగా నకిలీ వార్తలను వ్యాప్తి చేసిన 20 యూట్యూబ్ ఛానెల్లు, రెండు వెబ్సైట్లను బ్లాక్ చేసిన విషయం తెలిసిందే.