Fake news:దీపాలు 9 నిమిషాలు వెలిగిస్తే కరోనా వైరస్ నుంచి విముక్తి కలుగుతుందా..?
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని కరోనావైరస్ కుదిపేస్తోంది. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలు లాక్డౌన్లోకి వెళ్లిపోయాయి. ఇక లాక్డౌన్ సమయంలో ఎన్నో వదంతులు వస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఈ వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఇందులో మెజార్టీ వార్తలు బూటకపు వార్తలే కావడం విశేషం. ఈ వార్తలను నమ్మి కొందరు ఇదే నిజమనే భ్రమలో ఉంటున్నారు. లాక్డౌన్ సమయంలో ఏ వార్త వచ్చినా అది ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిందా లేదా అనేది మరొకసారి సరి చూసుకోవాలి. ఆ తర్వాతే ముందుకు వెళ్లడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
Recommended Video
కరోనావైరస్ దేశాన్ని కబళిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. ఈ లాక్ డౌన్ సమయంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక ఎప్పటికప్పుడు దేశ ప్రధాని ప్రజలను ఉద్దేశించి ప్రసంగం చేస్తున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ప్రధాని మోడీ చెబుతున్నారు. ఇళ్లకే పరిమితం కావడం, సామాజిక దూరం పాటించడంతోనే దేశం కరోనావైరస్ మహమ్మారి నుంచి విముక్తి పొందుతుందని చెబుతున్నారు. ఇందులో భాగంగానే మార్చి 22వ తేదీన జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చారు ప్రధాని మోడీ. ఇక మార్చి 25వ తేదీ నుంచి సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించారు. ఇక తాజాగా ఏప్రిల్ 5వ తేదీన రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు ఇళ్లల్లో లైట్లు ఆఫ్ చేసి దీపాలను వెలిగించాలని కోరారు. మోడీ చెప్పిన ఈ మాటలపై సోషల్ మీడియాలో పలు వదంతులు షికారు చేస్తున్నాయి.
దీపాలు వెలిగించడం వల్ల కరోనావైరస్ చచ్చిపోతుందనే పుకార్లు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నాయి. దీపాలు లేదా జ్యోతి వెలిగించడం వల్ల కరోనావైరస్ చచ్చిపోదు అనేది నిపుణులు చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలున్న చోట కరోనావైరస్ ఉండదని చెబుతూ నాసా పేరు మీద ఒక మెసేజ్ వైరల్ అవుతోంది. మరోవైపు 130 క్యాండిల్స్ను ఒకేసారి వెలిగిస్తే 9 డిగ్రీల సెల్సియస్ అధికంగా ఉష్ణోగ్రత పెరుగుతుందని ఐఐటీ ప్రొఫెసర్ చెప్పినట్లు మెసేజ్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఉష్ణోగ్రత వద్ద కరోనా వైరస్ చచ్చిపోతుందని ఆ మెసేజ్లో ఉంది. అదికూడా ఆదివారం రాత్రి 9గంటల9 నిమిషాలకు కరోనావైరస్ చచ్చిపోతుందనే వార్త హల్చల్ చేస్తోంది. కరోనావైరస్కు ప్రధాని మోడీ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారంటూ ప్రచారం జరుగుతోంది.
అయితే ఇలా సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న వదంతుల్లో ఎంతమాత్రం నిజంలేదు. ఇవన్నీ తప్పుడు వార్తలే కావడం విశేషం. ఇలాంటి వార్తలను నమ్మరాదని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఆదివారం రాత్రి 9 గంటలకు దీపాలు వెలిగించి 9 నిమిషాల పాటు లైట్లు ఆర్పివేయాలన్నది కేవలం కష్ట సమయాల్లో దేశం ఐక్యత చాటేందుకు తీసుకున్న కార్యక్రమం అని ప్రభుత్వం వివరణ ఇచ్చింది.