ఆర్ టీసీ సమ్మె: నకిలీ కండెక్టర్ అవతారం, ప్రజల దగ్గర డబ్బులు వసూలు, చివరికి!
చెన్నై: తమిళనాడులో గత ఎనిమిది రోజుల నుంచి ఆర్ టీసీ కార్మికులు మెరుపు సమ్మెతో 80 శాతం బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. తమిళనాడు ప్రభుత్వం మిగిలిన బస్సులను తాత్కాలిక డ్రైవర్లు, కండెక్టర్ల సహాయంతో నడిపిస్తున్నది.
సంక్రాంతి
సంక్రాంతి పండగ దగ్గర పడుతున్న సందర్బంలో సొంత ప్రాంతాలకు వెళ్లడానికి ప్రజలు అప్పుడే ప్రయాణం మొదలు పెట్టారు. అదే మంచి అదును అని భావించిన ఓ వ్యక్తి ప్రయాణికుల నుంచి నగదు లూటీ చెయ్యాలని ప్లాన్ వేశాడు.
తాత్కాలిక కండెక్టర్!
తమిళనాడులోని తిరువూరు ప్రాంతంలో సంచరిస్తున్న ఆర్ టీసీ బస్సులోకి వెళ్లిన వ్యక్తి తాత్కాలిక కండెక్టర్ అవతారం ఎత్తాడు. ప్రయాణికుల దగ్గర విచ్చలవిడిగా నగదు వసూలు చేసి టిక్కెట్లు ఇవ్వకుండా అయిపోయాయని, డిపో దగ్గర ఇస్తానని నమ్మించాడు.
చెకింగ్ ఇన్స్ పెక్టర్
తమిళనాడు ఆర్ టీసీలో టిక్కెట్ చెకింగ్ ఇన్స్ పెక్టర్ గా పని చేస్తున్న సెంథిల్ అదే సమయంలో అక్కడికి వెళ్లారు. ప్రయాణికుల దగ్గర టిక్కెట్లు లేకపోవడంతో సెంథిల్ కు అనుమానం వచ్చింది. కండెక్టర్ అవతారం ఎత్తిన వ్యక్తిని ప్రభుత్వం మంజూరు చేసిన గుర్తింపు కార్డు చూపించమని చెప్పారు.
ఎస్కేప్
ఆ సందర్బంలో నకిలీ కండెక్టర్ పారిపోవడానికి ప్రయత్నించాడు. ప్రయాణికులు, టిక్కెట్ చెకింగ్ కలెక్టర్ కలిసి అతన్ని పట్టుకుని తిరువూరు పోలీసులకు అప్పగించారు. ఆర్ టీసీ బస్సుల్లో ఇంకా ఎంత మంది నకిలీ తాత్కాలిక కండెక్టర్లు ఉన్నారు అని ఆరా తీస్తున్నారు.