కొడుకులా చూసుకుంటే.. కూతురిపైనే రేప్, హత్య
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్న కొడుకులా చూసుకున్న ఓ కుటుంబానికి కన్నీరు మిగిల్చాడు ఓ దుర్మార్గుడు. తమ కొడుకులా చూసుకున్న యువకుడు వారి కూతురిపై అత్యాచారం చేసి రాడ్డుతో తలపై మోది హత్యాయత్నం చేశాడు. అంతేగాక, అడ్డొచ్చిన ఆమె బంధువునూ అదే రాడ్డుతో మోది హత్య చేశాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజ్కుమార్(22) అనే యువకుడు చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్నాడు. వాయువ్య ఢిల్లీలో కద్దా కాలనీలో పొరుగున ఉండే ఓ కుటుంబం అతడిని కన్న కొడుకులాగే చూసుకునేవారు. వారికి 17 ఏళ్ల కూతురు ఉంది. ఆమెనిచ్చి తనకు పెళ్లి చెయ్యాలని ఇటీవల చాలా సార్లు వారితో గొడవ పడ్డాడు.
అయితే అందుకు వారు ఒప్పుకోలేదు. ఇంతలోనే వారు వేరే చోటికి ఇల్లు మారారు. కూతురు వారితో కలిసి వెళ్లకుండా బంధువుల అమ్మాయితో కలిసి అక్కడే ఉంటూ దగ్గరలోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తోంది.
ఇంట్లో ఉన్న ఆమెపై రాజ్కుమార్ అత్యాచారయత్నం చేశాడు. ఆమె ప్రతిఘటించడంతో బలమైన రాడ్డుతో ఆమె తలపై మోదాడు. అడ్డొచ్చిన ఆమె బంధువుల అమ్మాయినీ ఆ రాడ్డుతో కొట్టి చంపాడు.
కాగా, తాము కొడుకుగా భావించిన అతడే ఈ పని చేశాడంటూ.. మృతురాలి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.