రెచ్చిపోయిన ఫ్యాన్స్: థియేటర్ ధ్వంసం,,అర్ధరాత్రి విధ్వంసం: 32 మంది అరెస్టు
Recommended Video
చెన్నై: కోలీవుడ్ మాస్ హీరో దళపతి విజయ్ అభిమానులు రెచ్చిపోయారు. ఎంతలా రెచ్చిపోయారంటే.. ఓ థియేటర్ లో విధ్వంసాన్ని సృష్టించారు. అర్ధరాత్రి నడి రోడ్డుపై వీరంగం చేశారు. కంటికి కనిపించిన వస్తువులను పగుల గొట్టారు. ఫెక్సీలు చించేశారు. తమిళనాడులోని కృష్ణగిరిలో ఈ ఘటన చోటు చేసుకుంది. విజయ్ నటించిన తాజా చిత్రం బిగిల్. తెలుగులో విజిల్ పేరుతో విడుదలైంది. అట్లి దర్శకత్వం వహించిన ఈ మూవీ దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాధారణంగా ఓ స్టార్ హీరో సినిమా విడుదలవుతోందంటే.. విడుదలకు ముందురోజు అర్ధరాత్రి పూట ఫ్యాన్స్ కోసం ప్రత్యేక షోను వేస్తుంటారు.
స్పెషల్ షో రద్దు కావడంతో..
కృష్ణగిరిలోని రోండానా అయిదు రోడ్ల జంక్షన్ సమీపంలోని ఓ థియేటర్ లో బిగిల్ సినిమా స్పెషల్ షోను ప్రదర్శించాల్సి ఉంది. వందలాది మంది విజయ్ ఫ్యాన్స్ థియేటర్ వద్దకు చేరుకున్నారు. సాంకేతిక కారణాలతో సినిమా ప్రదర్శితం కాలేదు. తమ అభిమాన హీరో సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ నిరీక్షించిన అభిమానుల్లో అసహనం పెల్లుబికింది. ఆగ్రహం నషాళానికి అంటుకుంది. స్పెషల్ షో రద్దయినట్లు థియేటర్ యాజమాన్యం వెల్లడించిన వెంటనే.. కోపోద్రిక్తులయ్యారు. థియేటర్ లో విధ్వంసానికి పాల్పడ్డారు.
థియేటర్ లో విధ్వంసం..
థియేటర్ సిబ్బందిని తోసుకుంటూ లోనికి వెళ్లిన అభిమానులు కుర్చీలను ధ్వంసం చేశారు. అద్దాలను పగులగొట్టారు. కనిపించిన వస్తువులను కనిపించినట్లు విసిరి వేశారు. గట్టిగా కేకలు వేస్తూ గుంపులు గుంపులోగా అయిదు రోడ్ల జంక్షన్ వద్దకు చేరుకున్నారు. ఫ్లెక్సీలు, బ్యానర్లను చింపేశారు. మూత వేసిన షాపుల ముందు ఉన్న వస్తువులను రోడ్డపైకి విసిరి వేశారు. అయిదు రోడ్ల జంక్షన్ కావడంతో ట్రాఫిక్ ను క్రమబద్దీకరించడానికి పోలీసులు అందుబాటులో ఉంచిన ఇనుప బ్యారికేడ్లను పడగొట్టారు. కొందరు అభిమానులు బైకు హారన్లను మోగిస్తూ హల్ చల్ చేశారు. కొన్ని చోట్ల ఫ్లెక్సీలను తగుల బెట్టారు.
32 మంది అభిమానుల అరెస్టు..
వందలాది మంది అభిమానులు ఒక్కసారిగా గుమి కూడటం, విధ్వంసానికి పాల్పడటంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటన అంతా అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది. దీని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. అభిమానుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటిదాకా 32 మందిని అదుపులోకి తీసుకున్నట్లు కృష్ణగిరి జిల్లా ఎస్పీ బండి గంగాధర్ తెలిపారు. మరి కొందర్ని అదుపులోకి తీసుకోవాల్సి ఉందని, ప్రస్తుతం వారంతా పరారీలో ఉన్నారని చెప్పారు. అవాంఛనీయ సంఘటనను నివారించడానికి ఉద్దేశించిన సెక్షన్ల కింద వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
స్పెషల్ షోలను ప్రభుత్వం రద్దు చేయడం వల్లే..
అర్ధరాత్రి పూట అభిమానుల కోసం ప్రత్యేక షోలను ప్రదర్శించడాన్ని ప్రభుత్వం రద్దు చేసిందని కృష్ణగిరి థియేటర్ల అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. శుక్రవారం ఉదయం వారు విలేకరులతో మాట్లాడారు. అయిదు రోడ్ల జంక్షన్ థియేటర్ వద్ద చోటు చేసుకున్న ఘటనపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అనుమతిని రద్దు చేసిన తరువాత కూడా స్పెషల్ షోను రద్దు చేయాల్సి వస్తే.. భారీ జరిమానాలను చెల్లించాల్సి ఉంటుందని, దీన్ని దృష్టిలో ఉంచుకునే తాము ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని వెల్లడించారు. అభిమానులు ఆగ్రహం ఏ స్థాయిలో ఉంటుందో తమకు తెలుసునని చెప్పారు. అభిమానులు థియేటర్ లో పెద్ద ఎత్తున ఆస్తి నష్టానికి పాల్పడ్డారినికి, దీనికి బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నించారు.