రైతు నేత రాకేశ్ టికాయత్పై దాడి -సభ నుంచి తిరుగొస్తుండగా కారుపై రాళ్ల వర్షం -బీజేపీ గుండాల పనే అంటూ..
సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగుతోన్న రైతుల ఉద్యమంలో మరోసారి హింస చోటుచేసుకుంది. రైతు ఉద్యమ సారధి, భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ టికాయత్ పై శుక్రవారం దాడి జరిగింది. కిసాన్ పంచాయత్ లో పాల్గొని మరో ఊరికి వెళ్లే మార్గంలో ఆయన ప్రయాణిస్తోన్న కారుపై దుండుగులు రాళ్లు విసిరారు. ఈ ఘటనలో కారు అద్దాలు ధ్వంసమైపోయాయి.
రైతు ఉద్యమ నేత రాకేశ్ టికాయత్ పై రాజస్థాన్ లోని అల్వార్ జిల్లాలో దాడి జరిగింది. అక్కడి హర్సోరా గ్రామంలో కిసాన్ పంచాయత్ ముగిసిన అనంతరం బన్సుర్ లో మరో సభలో పాల్గొనేందుకు వెళుతుండగా, తాతర్ పూర్ అనే గ్రామంలో కొందరు దుండగులు టికాయత్ ను అడ్డుకునే ప్రయత్నం చేసి, కారుపై రాళ్లు విసిరారు.
రాకేశ్ టికాయత్ పై దాడిని గుర్తించి, మిగతా వాహనాల్లోని రైతులు పరుగెత్తి వచ్చేలోపే దుండగులు అక్కణ్నుంచి పారిపోయారు. ఈ ఘటన తాలూకు వీడియోను ట్విటర్ లో షేర్ చేసిన ఉద్యమ నేత.. ''ఇది బీజేపీ గుండాల పనే. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు'' అని ఆగ్రహం వెళ్లగక్కారు. భారీ ప్రమాదమేదీ తలెత్తకపోవడంతో రాకేశ్ బన్సుర్ వెళ్లిపోయి మరో సభలో పాల్గొన్నారు. కాగా,
పరిషత్ పోరు: ఏప్రిల్ 8న పోలింగ్ -నోటిఫికేషన్ జారీ -ఆగిన చోట నుంచే ఎన్నికలు -ఎస్ఈసీ నీలం సంచలనం
సాగు చట్టాలను వాపస్ తీసుకోవాలంటూ వేలాది మంది రైతులు నాలుగు నెలలకు పైగా ఢిల్లీ శివారుల్లో నిరసనలు తెలుపుతుండగా, వారితో కేంద్రం పలుమార్లు విఫల చర్చలు జరిపింది. జనవరి 26న ఎర్రకోట వద్ద హింస తర్వాత చర్చల ప్రక్రియ కూడా నిలిచిపోయింది. ఉద్యమాన్ని ఇప్పట్లో ఆపబోమని, మరో 8 నెలల వరకు ఉద్యమాన్ని ఆపే ఉద్దేశమే లేదని టికాయత్ క్లారిటీ ఇచ్చారు. మే 10 నాటికి చాలా చోట్ల పంటల కోతలు ముగుస్తాయని, ఆ తర్వాత నుంచి ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాయని రైతు సంఘం నేత గురువారం ఓ సభలో స్పష్టం చేశారు.