కేంద్రానికి ఐరాస షాక్- రైతుల చక్కా జామ్పై సంయమనం పాటించాలని సూచన
భారత్లో వ్యవసాయ చట్టాలకు నిరసనగా రైతులు ఇవాళ తలపెట్టిన చక్కా జామ్పై ఐక్యరాజ్యసమితి స్పందించింది. రైతుల చక్కా జామ్పై ( రహదారుల దిగ్బంధం) ఐక్యరాజ్య సమితి స్పందించింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు రైతు సంఘాలకు ఐక్యరాజ్యసమితి ఓ కీలక సూచన చేసింది. దీంతో ఈ వ్యవహారం అంతర్జాతీయ స్ధాయికి వెళ్లకుండా కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు మరో విఘాతం కలిగినట్లయింది.
భారత్లో ఇవాళ రైతులు తలపెట్టిన చక్కా జామ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వంతో పాటు రైతు సంఘాలు కూడా అత్యంత సంయమనంతో వ్యవహరించాలని ఐక్యరాజ్యసమితి కోరింది. ఐరాసకు చెందిన మానవ హక్కుల విభాగం ఈ మేరకు ఇరువర్గాలకు సూచన చేసింది. రైతులు శాంతియుతంగా గుమికూడటాన్ని, తమ అభిప్రాయాలు వ్యక్తం చేయడాన్ని ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో అవకాశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి ఐరాస మానవ హక్కుల హైకమిషనర్ ట్విట్టర్లో కోరారు. మానవ హక్కులు కల్పించే విషయంలో అన్ని అవకాశాలను పరిశీలించడం కాస్త కష్టమేనని ఆయన వ్యాఖ్యానించారు.
మరోవైపు అమెరికా ప్రతినిధుల సభలో భారత్కు చెందిన కంగ్రెషనల్ ఇండియా కాకసస్ కూడా దేశంలో రైతు నిరసనలకు కేంద్రం అడ్డంకులు కల్పించడం సరికాదని పేర్కొంది. ఈ విషయంలో వారికున్న ప్రజాస్వామిక హక్కులను కాలరాయొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. వారిని శాంతియుతంగా నిరసనలు చేసుకోనివ్వాలని, ఇంటర్నెట్ వాడకాన్ని కూడా అడ్డుకోవద్దని సూచించింది. దీంతో ఇప్పటికే అంతర్జాతీయ సెలబ్రిటీల స్పందనపై విరుచుకపడుతున్న కేంద్రానికి ఐరాసతో పాటు కంగ్రెషనల్ ఇండియా కాకసస్ స్పందన కూడా ఇబ్బందికరంగా మారుతోంది.