నిరుపేద మహిళా రైతును లోక్ సభ బరిలో దింపిన అధికార పార్టీ
భువనేశ్వర్: ఆమె పేరు ప్రమీలా బిసోయ్. వయస్సు ఆరు పదుల పైనే. నిరుపేద మహిళా రైతు. ఆమెకు ఉన్న వ్యవసాయ భూమి కనీసం ఎకరం కూడా లేదు. ఎకరం కంటే తక్కువ ఉన్న వ్యవసాయ భూమిని నమ్ముకుని జీవిస్తోంది ఆమె కుటుంబం. అలాంటి మహిళ పేరు ప్రస్తుతం రాష్ట్రంలో మారుమోగి పోతోంది. ఆమె పేరు ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది.
కారణం- వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ప్రమీలా బిసోయ్ పోటీ చేస్తుండటమే. అది కూడా ఏ అనామక పార్టీ నుంచో కాదు.. అధికార పార్టీ అభ్యర్థిగా బరిలో నిల్చుంటున్నారు. మన పొరుగు రాష్ట్రం ఒడిశాలో అధికారంలో ఉన్న బిజూ జనతాదళ్ (బీజేడీ) ఈ సరికొత్త ప్రయోగానికి తెర తీసింది. స్వయం సహాయక బృందం కార్యకర్తగా కూడా సేవలు అందిస్తోన్న ప్రమీలా బిసోయ్.. వచ్చే ఎన్నికల్లో కీలకమైన అస్కా లోక్ సభ స్థానం నుంచి బీజేడీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. ఈ విషయాన్ని బీజేడీ అధినేత, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వెల్లడించారు.
అస్కా నియోజకవర్గం నిజంగా కీలకమైనదే. బీజేడీకి కంచుకోట. స్వయంగా నవీన్ పట్నాయక్ రెండుసార్లు ఈ స్థానం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. గతంలో ఆయన తండ్రి బిజూ పట్నాయక్ కూడా ఈ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించారు. ఇప్పుడు కూడా ఈ స్థానం బీజేడీ చేతుల్లోనే ఉంది.
అస్కా నియోజకవర్గం ఆవిర్భవించినప్పటి నుంచీ 16 సార్లు ఎన్నికలు జరగ్గా.. ఏడు సార్లు బీజేడీ ఇక్కడ గెలిచింది. మరో రెండుసార్లు బీజేడీ మాతృపార్టీ జనతాదళ్ ఘన విజయం సాధించింది. 1996 నుంచి 2014 వరకూ జరిగిన అన్ని లోక్ సభ ఎన్నికల్లోనూ జనతాదళ్, బీజేడీలు వరుసగా విజయాలు సాధిస్తూ వస్తున్నాయి. అలాంటి కీలకమైన నియోజకవర్గంలో ఓ నిరుపేద మహిళా రైతును బరిలో దింపారు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్.
ప్రమీలా బిసోయ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడానికి పేద మహిళా రైతు అనే అంశం ఒక్కటే ప్రాతిపదికగా తీసుకోలేదు బీజేడీ నాయకత్వం. ఆమె స్వయం సహాయక బృందం సభ్యురాలు కూడా. మహిళా సాధికారత కోసం కృషి చేశారు. మహిళల ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చడానికి అహర్నిశలు శ్రమించారు. తాను పేదరికంతో పోరాడుతున్నప్పటికీ.. ఎక్కడా అవినీతికి పాల్పడలేదు. పలు స్వయం సహాయక బృందాల్లో నిరుపేద మహిళలను చేర్చగలిగారు. వారికి అవగాహన కల్పించారు. వారిలో చైతన్యాన్ని తీసుకొచ్చారు. ప్రమీలా బిసోయ్ చేసిన సేవలను గుర్తుంచుకున్న బీజేడీ..ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది.