ఏడాది కాలంగా కొనసాగుతున్న నిరసనలను నేడు విరమించుకోనున్న రైతులు?
న్యూఢిల్లీ: ఏడాది కాలంగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్న వేలాది మంది రైతులు గురువారం మధ్యాహ్నం తమ నిరసనలను నిలిపివేసే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం, ఇతర పెండింగ్లో ఉన్న సమస్యలను కూడా పరిష్కరించేందుకు అంగీకరించడంతో రైతు సంఘాల నేతలు తమ నిరసనలను విరమించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
గురువారం సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు నిరసనల విరమణపై ప్రకటన చేసే అవకాశం ఉంది. కాగా, దేశవ్యాప్తంగా రైతు సంఘాలు లేవనెత్తిన సమస్యలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వక ముసాయిదాను సంయుక్త కిసాన్ మోర్చా ఐదుగురు సభ్యుల కమిటీకి పంపింది. కేంద్రం ముసాయిదా ప్రతిపాదనపై చర్చించేందుకు రైతు సంఘం నేతలు తమ అగ్రనేతల సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
రైతుల సమస్యలకు సంబంధించి పెండింగ్లో ఉన్న అన్ని డిమాండ్లకు గానూ కేంద్రం రూపొందించిన ముసాయిదాపై ఏకాభిప్రాయం కుదిరినట్లు సంయుక్త కిసాన్ మోర్చా వెల్లడించింది. ఈ మేరకు ఎస్కేఎం కోర్ కమిటీ సభ్యుడు గుర్నామ్ సింగ్ చారుని వివరాలను వెల్లడించారు. ప్రభుత్వం ప్రతిపాదించిన పలు అంశాలపై ఏకీభవిస్తున్నట్లు తెలిపారు.
గురువారం సమావేశం అనంతరం ఆందోళన విరమించే విషయం నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. మరో రైతు నేత యుధ్ వీర్ సింగ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతుల డిమాండ్లను నెరవేర్చాలని, రైతులపై నకిలీ కేసుల ఉపసంహరణకు విధించిన షరతులు సహా, ప్రభుత్వ ప్రతిపాదనలోని కొన్ని అంశాలపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బంతి ఇప్పుడు ప్రభుత్వ కోర్టులోనే ఉందన్నారు.
వ్యవసాయ చట్టాలను రద్దు చేసినప్పటికీ.. కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)పై హాీ, రైతులపై కేసుల ఉపసంహరణ, మరణించిన రైతు కుటుంబాలకు పరిహారం వంటి ఇతర డిమాండ్లను కూడా నెరవేర్చాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ల సాధన కోసం కేంద్రంతో చర్చల కోసం ఎస్కేఎం ఐదుగురు సభ్యుల ప్యానెల్ ను కూడా ఏర్పాటు చేసింది. కేంద్రంతో చర్చల్లో లఖింపూర్ ఖేరీ ఘటన కూడా తమ ఎజెండాలో ఉంటుందని మరో రైతు సంఘం నేత రాకేశ్ టికాయత్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం వరకు నిరసనల విరమణపై రైతు సంఘాల నేతల నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉంది.