రైతుల పార్లమెంట్ మార్చ్: ఢిల్లీలో భారీగా మోహరించిన పోలీసులు, అడ్డుకునేందుకు ఏర్పాట్లు
న్యూఢిల్లీ: శీతాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో పార్లమెంటు వద్ద తమ నిరసన తెలిపేందుకు వందలాదిగా రైతులు దేశ రాజధానికి చేరుకుంటున్నారు. అయితే, గురువారం పార్లమెంటు వద్ద నిరసన తెలిపేందుకు రైతు నేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.
సింఘూ సరిహద్దు వద్ద ఇప్పటికే భారీగా పోలీసులు మోహరించారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానాలకు చెందిన రైతులు రహదారులపై ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు పార్లమెంటు సమావేశాలు జరుగుతుండటంతో అక్కడికి వెళ్లి తమ నిరసన తెలియజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
సింఘూ బోర్డర్ నుంచి జంతర్ మంతర్ వద్దకు పోలీసు ఎస్కార్టుతో బస్సుల్లో రైతులు వెళతారని రైతు నేతలు చెప్పారు. గురువారంనాడు 2500 ఢిల్లీ పోలీసులతోపాటు 3000 మంది పారామిలిటరీ సిబ్బంది కూడా సింఘూ బోర్డర్ వద్ద మోహరించనున్నారు. దీంతోపాటు యాంటీ రాయిట్ ఫోర్స్, వాటర్ క్యానన్స్, టియర్ గ్యాస్ లాంటి ఏర్పాట్లను చేసుకున్నారు.
అసాంఘిక శక్తులు దాడులకు పాల్పడేందుకు ప్రయత్నిస్తే గట్టి బుద్ధి చెప్పేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు. ఢిల్లీలో గత గణతంత్ర దినోత్సవంనాడు రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మక ఘటనలకు తావిచ్చిన విషయం తెలిసిందే. రైతుల దాడిలో వందలాది మంది పోలీసులు గాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. బలవంతంగా ఢిల్లీలోనికి వెళ్లేందుకు ప్రయత్నిస్తే కఠినంగా వ్యవహరించనున్నారు.
పార్లమెంటు ఆవరణలో ఎలాంటి నిరసనలకు పోలీసులు అనుమతివ్వలేదు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిరసనలు మానుకోవాలని పోలీసులు రైతు నేతలను కోరారు. అయితే, వారు మాత్రం అంగీకరించడం లేదు. 200 మంది రైతులు జంతర్ మంతర్ వద్దకు చేరుకుని ఉదయం 11 గంటల నుంచి 5 గంటల వరకు నిరసనలు చేస్తామని రైతు నేతలు పోలీసులకు వెల్లడించారు. ఈ సంఖ్యకు మించి రైతులు వచ్చినా, పార్లమెంటు వైపునకు వెళ్లేందుకు ప్రయత్నించినా వారిని అడ్డుకునేందుకు భారీ స్థాయిలో ఇప్పటికే పోలీసులు మోహరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగనీయొద్దని పోలీసులు హెచ్చరించారు. డ్రోన్లతో రైతుల కదలికలను గమనిస్తామని తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కూడా భారీ సంఖ్యలో జనం గుమిగూడేందుకు అనుమతి నిరాకరించింది.