మేకులు పీకలేదు -ప్లేస్ మార్చామన్న పోలీసులు -ప్రతిపక్ష నేతల అడ్డగింత -దుర్భేద్యంగా ఢిల్లీ సరిహద్దులు
వ్యవసాయ రంగంలో అద్భుత సంస్కరణలంటూ కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై రైతుల నిరసనలు నానాటికీ తీవ్రతరం అవుతున్నాయి. సదరు చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ దేశ రాజధాని ఢిల్లీ శివారుల్లో వేలాది మంది అన్నదాతలు చేస్తోన్న ఆందోళనలను గురువారం నాటికి 71వ రోజుకు చేరాయి. రిపబ్లిక్ డే నాటి ట్రాక్టర్ ర్యాలీలో హింస తర్వాత ఉద్యమంపై ఢిల్లీ పోలీసులు ఉక్కుపాదమోపడం, రైతుల రాకపోకల్ని నిలువరిస్తూ రోడ్లపై మేకుల్ని ఏర్పాటు చేయడం, ఢిల్లీలో ఇంటర్నెట్ షట్డౌన్పై అంతర్జాతీయంగా నిరసనలు వ్యక్తమవుతుండటం, వాటికి కేంద్రం సైతం ఘాటుగా స్పందిస్తుండటం లాంటి పరిణామాలు పరిస్థితిని మరింత వేడెక్కించాయి. ఈ క్రమంలో..

మేకులు పీకలేదన్న పోలీసులు
కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానాలకు చెందిన 40కిపైగా రైతు సంఘాల ఆధ్వర్యంలో వేలాది మంది రైతులు ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టగా, పోలీసులు వారిని సరిహద్దుల్లోనే అడ్డగించారు. అలా నవంబర్ 26 నుంచి ఇవాళ్టి వరకు ఢిల్లీ చుట్టూ సరిహద్దుల వద్దనే రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. సింఘూ బోర్డర్, ఘాజీపూర్ బోర్డర్, టిక్రి బోర్డర్లు ప్రధాన వేదికలుగా ఉన్నాయి. ఇప్పటికీ దీక్షా స్థలిలో ఉన్న రైతులతో కలిసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి కొత్తగా వేల సంఖ్యలో రైతులు వచ్చి చేరుతుండటంతో దాన్ని అడ్డుకునేందుకుగానూ పోలీసులు ఎక్కడికక్కడ రోడ్లపై బారికేడ్లు, భారీ మేకులు ఏర్పాటు చేశారు. ఢిల్లీ-ఉత్తరప్రదేశ్ సరిహద్దు అయిన ఘాజీపూర్ వద్ద రోడ్లపై ఏర్పాటు చేసిన మేకులను తొలగిస్తున్నట్లు గురువారం ఉదయం పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ నిజానికి మేకులను తొలగించలేదని, మరో చోట వాటిని పాతేశామని ఢిల్లీ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. తదుపరి ఆదేశాలొచ్చే వరకూ ఢిల్లీ సరిహద్దుల్లో నిషేధాజ్ఞలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.

ప్రతిపక్ష నేతలకు నో ఎంట్రీ
రైతుల ఉద్యమానికి ప్రధాన వేదికగా ఉన్న సింఘు బోర్డర్ ఇప్పటికే పూర్తిగా పోలీసుల హస్తాల్లోకి వెళ్లిపోగా, యూపీ సరిహద్దులోని ఘాజీపూర్ బోర్డర్ లోనూ అలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. ఘాజీపూర్ వేదికగా నిరసిస్తోన్న రైతులను కలిసేందుకు విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు ప్రయత్నించగా, వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీక్షా స్థలికి వెళ్లేందుకు అనుమతించబోమంటూ ఎంపీలను పోలీసులు నిలువరించారు. ఘాజీపూర్ సరిహద్దుకు వెళ్లిన విపక్ష ఎంపీల్లో అకాలీదళ్ ఎంపీ హర్ సిమ్రత్ కౌర్ బాదల్, డీఎంకే కనిమొళి, ఎన్సీపీ సుప్రియా సూలే, టీఎంసీ సౌగత్ రాయ్ తదితరులున్నారు. కాగా..

సభలో చర్చపై కేంద్రం మోసం
ఢిల్లీలో రైతుల ఉద్యమం, ఇంటర్నెట్ సేవల నిలిపివేతను ప్రశ్నిస్తూ అమెరికా పాప్ స్టార్ రిహానా సహా అంతర్జాతీయ సెలబ్రిటీలు కొందరు ట్వీట్లు చేసిన దరిమిలా.. భారత విదేశాంగ శాఖ సదరు సెలబ్రిటీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రైతుల నిరసనలు భారత్ అంతర్గత విషయమని, కొద్ది మంది రైతులు చేస్తోన్న ఆందోళనలపై పార్లమెంటులో చర్చ కూడా జరుగుతోందని, ఈ విషయంలో తొందరపడి ట్వీట్లు చేయొద్దని పేర్కొంది. అయితే, వాస్తవంలో మాత్రం పార్లమెంటులో రైతుల నిరసనలపై ఎలాంటి చర్చ జరగడంలేదని ఘాజీపూర్ బోర్డర్ కు వెళ్లిన ఎంపీలు కుండబద్దలు కొట్టారు. ''పార్లమెంట్ ఉభయసభల్లోనూ రైతులపై చర్చకు ప్రభుత్వం అనుమతించడంలేదు. కానీ విదేశాంగ శాఖ ప్రకటనలో మాత్రం అబద్ధాలు చెప్పారు. క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకుని, రైతులతో మాట్లాడేందుకు ప్రయత్నిచగా, మమ్మల్ని పోలీసులు అడ్డుకున్నారు'' అని ఎంపీలు వాపోయారు. ఇక..

దుర్భేద్యంగా ఢిల్లీ సరిహద్దులు
రిపబ్లిక్ డే హింస తర్వాత రైతులు, కేంద్రం మధ్య చర్చలు కూడా నిలిచిపోయిన క్రమంలో ఉద్యమంపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. దేశరాజధాని ఢిల్లీకి దారి తీసే అన్ని సరిహద్దులను దుర్భేద్యంగా మార్చేశారు. జాతీయ రహదారులను సైతం ఎక్కడిక్కడ తొవ్వేసి, కాంక్రీట్ డోగలు, బ్యారికేడ్లు, ఇనుప మేకులను ఏర్పాటు చేశారు. గురువారం నాటికి ఘాజిపూర్ సరిహద్దును పూర్తిగా మూసేశారు. ఎన్హెచ్ 24, ఎన్హెచ్ 9 గుండా వెళ్లే వాహనాలను నోయిడా లింక్ రోడ్ మీదుగా తరలిస్తున్నారు. సింఘు, పియావు మణియారి, సబోలి, ఆచండి సరిహద్దులు ఇప్పటికే మూసేసి ఉండటంతో అక్కడ కూడా ట్రాఫిక్ మళ్లింపులు కొనసాగుతున్నాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు రోజువారీ పనుల కోసం కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. మీడియాను సైతం కనీసం 10 కిలోమీటర్ల అవతలే అడ్డుకుంటున్నారు. రిపోర్టర్లు పొలాల వెంబడి నడిచి వెళ్లినా.. అక్కడ ఇంటర్నెట్ లేకపోవడంతో వార్తల రిపోర్టింగ్ ఆలస్యంగా జరుగుతోంది. మరోవైపు..

రైతు కుటుంబానికి ప్రియాంక పరామర్శ..
కెనడా నుంచి ఈ మధ్యే తిరిగొచ్చి, ఢిల్లీ వేదికగా జరుగుతోన్న రైతుల ఉద్యమంలో పాల్గొని, జనవరి 26నాటి ట్రాక్టర్ ర్యాలీలో ప్రాణాలు కోల్పోయిన నవజీత్ సింగ్ కుటుంబాన్ని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ పరామర్శించారు. ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ జిల్లాకు చెందిన నవజీత్ సింగ్ కుటుంబీకులు అందరూ స్థానికంగా వ్యవసాయం చేసుకుంటున్నారు. కుటుంబమంతా ఆందోళనల్లో పాలుపంచుకోగా, ఈ మధ్యే కెనడా నుంచి వచ్చిన నవజీత్ కూడా వారికి తోడయ్యాడు. అయితే ప్రమాదవశాత్తూ ట్రాక్టర్ పైనుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. రైతుల ఉద్యమం కొనసాగుతోన్న 71 రోజుల్లో వివిధ కారణాలతో 200 మంది చనిపోయినట్లు రైతు సంఘాలు చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications