ప్రాణాలకు ముప్పు: ఇంటికి తాళాలేసి వెళ్లిపోయిన మురుగన్
చెన్నై: ప్రముఖ తమిళ రచయిత పెరుమాల్ మురుగన్ ప్రాణాలకు ముప్పు తప్పనట్లే ఉంది. తనపై దాడి జరుగుతుందనే భయంతో ఆయన తనను బదిలీ చేయాలని విజ్ఞప్తి చేసుకున్నారు. తన నవల వన్ పార్ట్ ఆఫ్ ఎ వుమెన్పై స్థానికంగా హిందూ సంస్థలు బెదిరింపులకు, ఆందోళనలకు దిగడంతో ఆయన తానిక రచనలు చేయబోనని ప్రకటించారు. రచయితగా తాను మరణించానని కూడా చెప్పారు. అధ్యాపకుడిగానే కొనసాగుతానని అన్నారు. అయినా తన ప్రాణాలకు ముప్పు తప్పలేదనే ఆందోళనతో ఆయన ఉన్నారు.
పెరుమాళ్ మురుగన్ ప్రస్తుతం నమక్కల్లో పనిచేస్తున్నారు. తనను చెన్నైకి బదిలీ చేయాలని ఆయన కోరుతున్నారు. ఆయన ఇంటికి తాళం వేసి ఉంది. తన భార్యతో కలిసి ఆయన భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. మిత్రులు, ఇరుగుపొరుగువారు, బంధువులు ఆయనను వెళ్లిపోవడానికి ప్రేరేపించినట్లు చెబుతున్నారు. నమ్మక్కల్ నుంచి వెళ్లిపోతే తప్ప భద్రత ఉండదని వారు చెప్పినట్లు సమాచారం.
తమిళంలో మధోరుబగన్ అనే నవల రాసినందుకు ఆయనకు వ్యతిరేకంగా హిందూ, మత సంబంధ సంస్థలకు ఆందోళన చేపట్టాయి. అది వన్ పార్ట్ ఆఫ్ వుమెన్ పేరుతో ఆంగ్లంలోకి అనువాదమైంది. ఆ నవల తొలిసారి 2010లో అచ్చయింది. గొడ్రాళ్లు పిల్లలను కనడానికి వివాహానికి వెలుపల లైంగిక సంబంధం పెట్టుకునే ప్రాచీన సంప్రదాయాన్ని ఆ నవలలో పెరుమాళ్ మురుగన్ చిత్రించారు.
మహిళలను, స్థానిక ఆలయ ఉత్సవాలను అవమానించారనే ఆగ్రహంతో మురుగన్పై స్థానికంగా ఆందోళనలు చెలరేగాయి. తన నవలను ఉపసంహరించుకుంటూ మురుగన్ బలవంతం మీద చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని ప్రజా పౌర హక్కుల సంఘం మద్రాసు హైకోర్టును కోరింది. ఆ ఒప్పందం ప్రాథమిక హక్కులను కాలరాసేదిగా ఉందని పియుసిఎల్ అభిప్రాయపడింది.
మురుగన్ స్వస్థలం కొంగు ప్రాంతంలో గౌండర్ కమ్యూనిటీ బలంగా ఉంది. దాంతో మురుగన్కు అనుకూలంగా మాట్లాడడానికి ఏ రాజకీయ పార్టీ కూడా ముందుకు రావడం లేదు. ప్రభుత్వం మౌనం పాటిస్తూ వస్తోంది.