ఇంటికి రమ్మనందుకు.. ముగ్గురు అక్కాచెల్లెళ్లు కలిసి పొడిచేశారు
మీరట్ : అప్పు తీసుకున్న వ్యక్తి తిరిగి తీర్చడం లేదని వేధించడం మొదలుపెట్టిన ఓ వడ్డీ వ్యాపారి.. అతని కూతుళ్లపై కన్నేశాడు. ముగ్గురు కూతుళ్లలో ఒక యువతిని తన ఇంటికి రావాల్సిందిగా వేధించడం మొదలుపెట్టాడు. దీంతో ఆత్మాభిమానం చంపుకోలేక తిరగబడ్డ ముగ్గురు యువతులు అతన్ని దారుణంగా హత్య చేశారు. ఉత్తరప్రదేశ్ లోని షమ్లీలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. షమ్లీలో నివసించే షమిమ్ మహమ్మద్ అనే ఓ వడ్డీ వ్యాపారి నుంచి ఓ వ్యక్తి లక్ష రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అయితే అప్పు తీర్చడంలో జాప్యం జరుగుతుండడంతో.. తరుచు అతని ఇంటికి వెళ్లి వేధించడం మొదలుపెట్టాడు వడ్డీ వ్యాపారి. ఇదే క్రమంలో అతని ముగ్గురు కూతుళ్లపై కన్నేసిన షమిమ్.. ముగ్గురిలో ఒకరిని తన ఇంటికి రావాల్సిందిగా వేధించసాగాడు.
షమిమ్ వేధింపులు భరించలేక.. నేరుగా అతని ఇంటికెళ్లిన ముగ్గురు యువతులు.. కత్తులతో అతన్ని తీవ్రంగా పొడిచారు. షమిమ్ శరీరంలో 20 కత్తిపోట్లు ఉండడం చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. హత్యానంతరం పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు యువతులతో పాటు వారికి సహకరించిన బాయ్ ఫ్రెండ్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.