మూడేళ్ల బాలికను లైంగికంగా వాడుకున్న మహిళా వార్డెన్..
ముంబై : మహిళల సంరక్షణలోను ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోవడం తల్లిదండ్రులను కలవరపాటుకు గురిచేస్తోంది. పేదరికం కారణంగా సంక్షేమ హాస్టల్ లో ఉండి చదువుకుంటున్న ఓ మూడేళ్ల బాలికపై హాస్టల్ లో ఉండే ఓ మహిళా వార్డెనే అఘాయిత్యానికి తెగబడడం తాజాగా అందరిని నివ్వెరపోయేలా చేసింది.
ముంబైలోని సబర్బన్ లో ఉన్న బాలికల సంక్షేమ హాస్టల్ లో ఓ మూడేళ్ల బాలిక ఆశ్రయం పొందుతోంది. అయితే అదే హాస్టల్ లో వార్డెన్ గా పనిచేస్తోన్న 52 ఏళ్ల మహిళా వార్డెన్ తన కామాన్ని ఆ చిన్నారిపై ప్రదర్శించింది. తన కోర్కెలు తీర్చుకోవడానికి చిన్నారిని లైంగికంగా వాడుకుంది. చిన్నారి ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పినా..! వార్డెన్ పై ఫిర్యాదు చేస్తే, ఎక్కడ హాస్టల్ నుంచి తీసేస్తారోనన్న భయంతో బాలికను కూడా ఎవరికి చెప్పకుండా ఉండాల్సిందిగా కోరారు.
అయితే క్లాస్ రూమ్ లో ఎప్పుడూ చురుగ్గా ఉండే బాలిక.. ఉన్నట్లుండి మౌనంగా ఉంటూ వస్తుండడంతో టీచర్స్ కు అనుమానం తలెత్తింది. దీంతో బాలికను విషయంపపై ఆరా తీయగా అప్పుడు గానీ అసలు విషయం బయటపడలేదు. బాలిక చెప్పిన వివరాల మేరకు స్కూల్ ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. మహిళా వార్డెన్ పై కేసు నమోదైనట్లుగా సమాచారం. అయితే విచారణ విషయాలపై స్పందించడానికి బాలిక తల్లిదండ్రులు నిరాకరించినట్లుగా తెలుస్తోంది.