కేజ్రీవాల్ ఫెవికాల్ కొన్నారు, బీజేపీకి థ్యాంక్స్: యోగేంద్ర
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ ఫెవికాల్ డబ్బా కొనుక్కున్నారని, ఇక పదవి వదిలి పెట్టి పోవడం ఉండదని ఆ పార్టీ సీనియర్ నేత యోగేంద్ర యాదవ్ చమత్కరించారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ 49 రోజులకే రాజీనామా చేశారు.
ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. అది తప్పని తెలిసిందని, మరోసారి ఇలా రాజీనామా చేయనని చెప్పారు. శనివారం ఎన్నికలు ముగిశాయి. ఈ నేపథ్యంలో యోగేంద్ర యాదవ్ మాట్లాడారు. ఇప్పుడు ఇక పదవిని వదిలి పెట్టి పోవడం ఉండదని, కేజ్రీవాల్ ఫెవికాల్ డబ్బా కొనుక్కున్నారని విలేకరులతో నవ్వులు పంచుకున్నారు.
ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఏఏపీకి అనుకూలంగా ఉండపోతున్నాయని చెప్పారు. తాము గెలిస్తామనే నమ్మకం ఉందన్నారు. అయితే, భారీ ఆధిక్యం వస్తే అది బీజేపీ చలువేనని చెప్పారు. బీజేపీ అంతర్గత విభేదాలో తమకు కలిసి వచ్చాయన్నారు.

ఎన్నికలు అయిపోయిన నేపథ్యంలో కేజ్రీవాల్ ఏఏపీ కార్యకర్తలకు ఓ పిలుపు ఇచ్చారు. కార్యకర్తలు కుటుంబ సభ్యులతో గడపాలని సూచించారు. సినిమాలు చూడండని, ధ్యానం చేయాలని చెప్పారు. దేవుడు మిమ్మల్ని అనుగ్రహించాలని కేజ్రీవాల్ ఆకాంక్షించారు. ఢిల్లీ ఎన్నికల్లో కార్యకర్తలు అద్భుతంగా పని చేశారన్నారు.
కాగా, అరవింద్ కేజ్రీవాల్తో సెల్ఫీ దిగేందుకు మీడియా, పోలింగ్ సిబ్బంది శనివారం ఎగపడ్డారు. కొత్త ఢిల్లీ నియోజకవర్గంలోని బీకే దత్ కాలనీ పోలింగ్ స్టేషన్లో శనివారం ఉదయం ఓటు వేయడానికి వచ్చిన కేజ్రీవాల్ను మీడియా చుట్టుముట్టింది. ఓటు వేసి వచ్చిన అనంతరం ఆయన మీడియాకు ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. అనంతరం వారితో కలిసి సెల్ఫీలు దిగారు.












Click it and Unblock the Notifications