రేప్ యత్నం: బావను కత్తితో పొడిచి చంపిన మరదలు
పోలీసుల కథనం ప్రకారం ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బాధితురాలి తండ్రి ఇటీవల మరణించడంతో తన తల్లితోపాటు టెలిఫోన్ కాలనీలో ఉంటున్న తన సోదరి ఇంటికి వెళ్లింది. బాధితురాలి సోదరి హేమ (28), ఆమె భర్త మాథ్యూ వినోరాజ్ (32), వారి కుమారుడు మెర్లిన్ జోసెఫ్(8)లు టెలిఫోన్ కాలనీలో నివాసం ఉంటున్నారు.
కాగా హేమ భర్త వినోరాజ్ తరచూ మద్యం తాగి వచ్చి బాధితురాలిని లైంగికంగా వేధించేవాడు. ఈ విషయం తెలుసుకున్న హేమ, ఆమె తల్లి.. వినోరాజ్ను పలుమార్లు హెచ్చరించారు. అయినా వారి మాటలు పట్టించుకోకుండా వినోరాజ్ తరచూ వేధింపులకు పాల్పడుతూనే ఉన్నాడు. గురువారం రాత్రి కూడా బాగా మద్యం సేవించి వచ్చిన వినోరాజ్.. బలవంతంగా బాధితురాలిని తన గదిలోకి తీసుకెళ్లాడు.
ఆ తర్వాత ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు. అయితే బాధితురాలు అతన్ని నుంచి తప్పించుకుని అతనికి దొరక్కుండా గది చుట్టూ తిరిగింది. అతని వేధింపులు తట్టుకోలేని బాధితురాలు గదిలో దొరికిన కత్తితో వినోరాజ్పై దాడికి దిగింది. ఆ ఆవేశంలోనే అతడు చనిపోయే వరకు కత్తితో పొడిచింది. అనంతరం బాధితురాలు పోలీసులకు ఫోన్ చేసి తన బావను హత్య చేసినట్లు సమాచారం ఇచ్చింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.
వినోరాజ్ తరచూ ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు స్థానికుల ద్వారా పోలీసులు తెలుసుకున్నారు. బాధితురాలి సోదరి హేమ కూడా ఈ విషయాన్ని పోలీసుల ముందు అంగీకరించింది. దీంతో తన ఆత్మరక్షణలో భాగంగానే బాధితురాలు ఈ హత్యకు పాల్పడిందని పోలీసులు నిర్ధారించారు.