వరదలను జయించి వికసించిన పుష్కర పుష్పాలు : మున్నార్లో పన్నెండేళ్లకోసారి కనువిందు చేసే పువ్వులు
కేరళ: పదిహేను రోజుల క్రితం కేరళ రాష్ట్రం వరదల ధాటికి అల్లాడిపోయింది. ప్రకృతి పై ప్రకృతే పగబట్టింది. అక్కడ కురిసిన భారీ వర్షాలకు కేరళ రాష్ట్రం రూపురేఖలే మారిపోయాయి. అసలు ఏ ప్రాంతం ఎక్కడుందో గుర్తుపట్టలేని స్థితిలో వరదలు ఆ దేవభూమిని ముంచెత్తాయి. గత వందేళ్లలో ఎప్పుడూ లేనంతగా ఈ సారి కురిసిన భారీ వర్షాలకు కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయారు. కొన్ని వేలమంది నిరాశ్రయులుగా మారారు. చెట్టుకొకరు పుట్టకొకరుగా మిగిలారు. అయితే దేవభూమి తిరిగి కోలుకునేందుకు కొన్నేళ్లు పడుతుందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు.
ప్రకృతి ప్రకోపానికి కొట్టుకుపోయిన మున్నార్ అందాలు
ఇక భారీ వర్షాలకు ఆ పై వచ్చిన వరదలకు భారీగా నష్టపోయింది మాత్రం పర్యాటక రంగం. కేరళ రాష్ట్ర అందాలను తిలకించేందుకు దేశ నలుమూలలనుంచే కాక విదేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తూ ఉంటారు. కేరళలో వర్షాలు భారీగా కురుస్తున్నాయన్న సమాచారం తెలుసుకోగానే వారంతా తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. ఒక్క పర్యాటక రంగం నుంచే కొన్ని కోట్ల వ్యాపారం కేరళలో జరుగుతుంది. ఇక పర్యాటక ప్రాంతాల్లో భారీగా దెబ్బతిన్నది మాత్రం ప్రముఖ హిల్ స్టేషన్ మున్నార్. వరద నీరు ఆ ప్రాంతాన్ని ముంచేసింది. దీంతో అక్కడి అందాలు కనుమరుగయ్యాయి. అసలు మున్నార్ ప్రాంతమేనా అని అనుమానం రాకపోదు. మరోవైపు వర్షాకాలం ప్రారంభం అవుతుందంటే ఇక్కడి వ్యాపారులకు పండగే. ఎందుకంటే వర్షం పడుతున్న వేళ మున్నార్ ప్రాంతంలో ఉంటే ఆ అనుభూతే వేరు. అందుకే చాలా మంది ఈ ప్రాంతానికి తరలి వస్తుంటారు.
పర్యాటకులను పలకరించేందుకు సిద్ధమైన నీలకురింజి పుష్పాలు
ఈ సారి మున్నార్ ప్రాంతంలో మరో ప్రత్యేక అతిథి పర్యాటకులను పలకరించేందుకు సిద్ధమైంది. పన్నెండేళ్లకు ఒకసారి వికసించే నీలకురింజి పువ్వులు పర్యాటకులను అలరించేందుకు సిద్ధమవుతుండగా భారీ వర్షాలు, వరదలు ఆ అందాలు కనుమరుగయ్యేలా చేశాయి. వర్షాకాలం ప్రారంభం అయ్యాక ఆగష్టులో ఈ నీలకురింజి పువ్వులు దర్శనమిస్తాయి. వర్షాలు సకాలంలో రాకుండా... ఎవరూ ఊహించని సమయంలో భారీ వర్షాలుగా మారి ఆ పై వరదలు రావడంతో మున్నార్ ప్రాంతంలో కొండచరియలు విరిగి పడ్డాయి. దీంతో చాలా అరుదుగా కనిపించే నీలకురింజి పువ్వులు వికసించే సమయానికి కొండచరియలు కింద పడి నలిగిపోయాయి.
వర్షాలు తగ్గాక కూడా మున్నార్ను సందర్శించే పర్యాటకులు తక్కువైపోయారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు రవాణా వ్యవస్థ దెబ్బతినింది. రోడ్లు సరిగ్గా లేవు. మున్నార్ ప్రాంతానికి చేరుకునేందుకు పర్యాటకులకు సరైన సదుపాయాలు లేవు. దీంతో ఆ ఒక్క ప్రాంతంలోనే పన్నెండేళ్లకోసారి వికసించే నీలకురింజి పువ్వులు కూడా ఈ సారి కనిపించడంలేదన్న వార్త రావడంతో మున్నార్ ప్రాంతానికి పర్యాటకులు రావడం మానేశారు.
నీలకురింజి పుష్పాలకు ప్రాణం పోసిన భగవంతుడు
అయితే ప్రకృతి ప్రకోపానికి భగవంతుడు అడ్డుకట్టవేశాడు. ఆయన సృష్టించిన దేవభూమిపై కాస్త జాలి ప్రదర్శించాడు. ఎప్పుడో పన్నెండేళ్లకోసారి వికసించే నీలకురింజి పుష్పాలకు మళ్లీ ప్రాణం పోశాడు. వరదలు పెట్టిన హింసను తట్టుకుని ఆ బుల్లి పుష్పాలు నవ్వుకుంటూ మున్నార్ పర్వతాల్లో పర్యాటకులను కనువిందు చేసేందుకు సిద్ధపడ్డాయి. మున్నార్లోని చాలా ప్రాంతాల్లో నీలకురింజి పుష్పాలు వికసించడం ప్రారంభించాయి.
మున్నార్లోని రాజమాల హిల్ స్టేషన్, కంతలూరు, వట్టవాడల్లో పుష్పాలు కనిపించి స్థానికులకు కనువిందు చేస్తున్నాయి. రానున్న రోజుల్లో వాతావరణం సహకరిస్తే ఈ పువ్వులు మున్నార్ ప్రాంతమంతా కనిపించే అవకాశం ఉంది. ఈ పూల సందడి అక్టోబర్ వరకు ఉంటుంది. ఇది కచ్చితంగా మున్నార్ పర్యాటక రంగానికి మంచి వార్తే. ఎందుకంటే ఈ పూలను చూసేందుకే చాలామంది విదేశాల నుంచి వస్తుంటారు. వరదల ధాటికి ఈ సారి కనువిందు చేయవనుకున్న నీలకురింజి పుష్పాలు... తిరిగి కనిపించడంతో పర్యాటక రంగానికి కొంత ఆశ చిగురించింది.
నీలకురింజి పువ్వులు వికసించడంతో చిగురించిన ఆశలు
కేవలం నీలకురింజి పుష్పాలను వీక్షించేందుకు చాలామంది పర్యాటకులు మున్నార్కు వస్తుంటారు. కానీ భారీ వర్షాలకు వరదలకు ఈ సారి 8లక్షల మంది పర్యాటకులు కూడా ప్రాంతాన్ని సందర్శించే అవకాశం లేదనుకున్న తరుణంలో...నీలకురింజి పుష్పాలు దర్శనం ఇవ్వడంతో పర్యాటక రంగం మళ్లీ పుంజుకుంటుందని భావిస్తున్నారు అక్కడి వ్యాపారస్తులు. అయితే ఇంకా మీ టికెట్స్ క్యాన్సిల్ చేసుకోకుంటే కచ్చితంగా మున్నార్ ప్రాంతాన్ని సందర్శించండి. పుష్కరకాలానికోసారి కనువిందు చేసే నీలకురింజి పుష్పాలను కచ్చితంగా చూడండి.
నీలకురింజి పుష్పాలను వీక్షించాలంటే బెస్ట్ ప్లేస్ రాజమాలలోని ఎర్నాకులం నేషనల్ పార్కును సందర్శించండి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇందులోకి పర్యాటకులను అనుమతిస్తారు. ఇక ప్రవేశ రుసుము పెద్దవారికి రూ.120 పిల్లలకు రూ.90. విదేశీయులకు రూ. 400 ప్రవేశ రుసుం ఉంటుంది.