ఎట్టకేలకు రాహుల్ టూర్ కు యోగీ సర్కార్ అనుమతి-ఇద్దరు సీఎంలతో కలిసి లఖీంపూర్ కు
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఉత్తర్ ప్రదేశ్ లోని లఖీంపూర్ ఖేరీ వెళ్లేందుకు ఎట్టకేలకు యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ అనుమతి ఇచ్చింది. అంతకు ముందు అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి లక్నో ఎయిర్ పోర్టు బయటికి వెళ్లకుండా రాహుల్ తో పాటు పంజాబ్, ఛత్తీస్ ఘడ్ సీఎంలు చరణ్ జీత్ చన్నీ, భూపేష్ బఘేల్ ను కేంద్ర బలగాలు అడ్డుకున్నాయి. దీంతో లక్నో ఎయిర్ పోర్టులో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. యోగీ సర్కార్ తనకు ఇచ్చిన అనుమతి ఇదేనా అని రాహుల్ గాంధీ లక్నో ఎయిర్ పోర్టులో పోలీసుల తీరును మీడియాతో పంచుకున్నారు. అనంతరం ట్విట్టర్ లోనూ రాహుల్ గాంధీ బీజేపీ సర్కార్ తీరుపై ప్రశ్నలవర్షం కురిపించారు. ఇదేం అనుమతి, నన్ను చూసి బీజేపీ సర్కార్ ఎందుకు భయపడుతోందని రాహుల్ ప్రశ్నించారు.
#WATCH | Congress leader Rahul Gandhi asks police officials at Lucknow airport "under which rule are you deciding how I'll go? Just tell me the rule."
— ANI (@ANI) October 6, 2021
Gandhi is leading a Congress delegation to violence-hit Lakhimpur Kheri pic.twitter.com/X0HeOzQB5e
లక్నో ఎయిర్ పోర్టులో కాసేపు ఉద్రిక్తత తర్వాత రాహుల్ తో పాటు చన్నీ, బఘేల్ ను లఖీంపూర్ ఖేరీ వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. దీంతో రాహుల్ టీమ్ లక్నో నుంచి బయలుదేరి ముందుగా తన సోదరి ప్రియాంక గాంధీని నిర్బంధించిన సీతానగర్ గెస్ట్ హౌస్ కు వెళ్లనున్నారు. అక్కడ ప్రియాంకను పరామర్శించిన తర్వాత రాహుల్ టీమ్... లఖీంపూర్ ఖేరీకి వెళ్లి అక్కడ మృతుల కుటుంబాలను పరామర్శించబోతోంది. మరోవైపు ప్రియాంక గాంధీని రెండు రోజుల క్రితం లఖీంపూర్ వెళ్లేందుకు అనుమతి నిరాకరించిన యోగీ సర్కార్.. ఇవాళ ముందు రాహుల్ గాంధీకి కూడా అనుమతి ఇవ్వలేదు. కానీ దేశవ్యాప్తంగా లఖీంపూర్ వీడియోలు హల్ చల్ చేస్తున్న నేపథ్యంలో అక్కడ దాచడానికి ఏమీ లేదని గుర్తించిన బీజేపీ సర్కార్.. ఎట్టకేలకు రాహుల్ కు అనుమతి ఇచ్చింది.
Recommended Video
ప్రస్తుతం లఖీంపూర్ ఖేరీ పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉండటంతో రాహుల్ గాంధీ కేవలం ఇద్దరు కాంగ్రెస్ సీఎంలను మాత్రమే వెంట బెట్టుకుని వెళ్తున్నారు. ముుగ్గురి కంటే ఎక్కువ మంది పర్యటనలు చేసేందుకు వీల్లేకపోవడంతో కాంగ్రెస్ సీఎంలు చరణ్ జీత్ చన్నీ, భూపేష్ భగేల్ తో కలిసి రాహుల్ ఈ టూర్ చేస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరు సీఎంలు లఖీంపూర్ మృతుల కుటుంబాలకు భారీగా పరిహారం కూడా ప్రకటించారు. పంజాబ్ సీఎం చన్నీ ఒక్కో బాధిత కుటుంబానికీ 50 లక్షలు ప్రకటించగా.. ఛత్తీస్ ఘడ్ సీఎం బఘేల్ రూ.25 లక్షల చొప్పున ప్రకటించారు. మృతిచెందిన రైతులతో పాటు జర్నలిస్టుల కుటుంబాలకు కూడా ఈ పరిహారం ఇవ్వనున్నారు. ఇవాళ లఖీంపూర్ లో బాధిత కుటుంబాలకు వీరు ప్రకటించిన పరిహారం చెక్కుల్ని అందించే అవకాశముంది.