బడ్జెట్ బ్రీఫ్కేస్తో ప్రధాని వద్దకు అరుణ్ జైట్లీ, బడ్జెట్ రూపకల్పన ఇలా, కొన్ని ఆసక్తికర విషయాలు...
న్యూఢిల్లీ: 2018-19 వార్షిక బడ్జెట్ ను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫిబ్రవరి 1న గురువారం అంటే.. ఈ రోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11 గంటలకు బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అంతకంటే ముందు బడ్జెట్ ప్రతిపాదనలను కేంద్ర క్యాబినెట్ ఆమోదించనుంది.
ఇప్పటికే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ బ్రీఫ్కేస్ను తీసుకుని ప్రధాని నరేంద్ర మోడీ వద్దకు బయలుదేరారు. ఈ ఉదయం 10 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశం కానున్న కేంద్ర క్యాబినెట్, జైట్లీ బడ్జెట్ పై చర్చించి ఆమోదం తెలుపనుంది.
మరోవైపు అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య బడ్జెట్ ప్రతులు పార్లమెంట్కు కూడా చేరాయి. పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి కేవలం ఒక గంట ముందు మాత్రమే ఈ బడ్జెట్ ప్రతులు కేంద్ర మంత్రుల చేతికి అందుతాయి.
బడ్జెట్.. అనగానే చాలామంది లెక్కల చిక్కులే అనుకుంటారు! కానీ ఈ మూడక్షరాల వెనుక 6 నెలల కృషి దాగుంటుంది. ఎంతో కసరత్తు.. లెక్కకు మించి భేటీలు.. గోప్యత.. అబ్బో చాలా తతంగమే ఉంటుంది. ఈ నేపథ్యంలో బడ్జెట్ తయారీకి సంబంధించిన కొన్ని విశేషాలు... మీకోసం.

యేటా సెప్టెంబర్లోనే మొదలు...
రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఏయే రంగాలకు ఎంతెంత ఖర్చు చేయాలనే కసరత్తు యేటా సెప్టెంబర్ నెలలోనే మొదలవుతుంది. దేశంలో మొత్తం జనాభా తమ తిండి కోసం ఏడాది అంతా ఎంత ఖర్చు చేస్తున్నారో దాదాపు అంత మొత్తాన్ని ప్రభుత్వం బడ్జెట్కు కేటాయిస్తుంది.

అక్టోబర్లో చర్చలు, డిసెంబర్లో బ్లూ ప్రింట్స్
ఏటా బడ్జెట్కు సంబంధించిన చర్చలు అక్టోబర్ నెలలో మొదలవుతాయి. వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు తమ తమ శాఖలకు అవసరమైన నిధులపై ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో చర్చల్లో నిమగ్నమవుతారు. బడ్జెట్ ప్రతుల తయారీలో భాగంగా ముసాయిదా బడ్జెట్ పత్రాలను అధికారులు ఆర్థిక మంత్రికి అందజేస్తారు. ఈ ముసాయిదా ప్రత్రాలన్నీ నీలం రంగులో ఉంటాయి.

సలహాలు.. సూచనలు...
కొత్త ఏడాది ప్రారంభంలో బడ్జెట్కు సంబంధించి సలహాలు, సూచనలు మొదలవుతాయి. పారిశ్రామిక, బ్యాంకింగ్ రంగాలకు చెందిన వివిధ సంఘాల ప్రతినిధులు తమ సమస్యలు, సలహాలను, సూచనలను ఆర్థిక మంత్రిని కలిసి విన్నవించుకుంటారు. అయితే ఆర్థిక మంత్రి అందరి వాదనలు వింటారుగానీ అప్పటికప్పుడే ఎవరికీ నిర్ధుష్టమైన హామీ ఇవ్వరు.

ముద్రణ ప్రక్రియ ఇలా...
ఏటా‘హల్వా వేడుక'తో బడ్జెట్ ప్రతుల ముద్రణ ప్రక్రియ షురూ అవుతుంది. ఈ వేడుక అనంతరం ఆర్థిక శాఖలో పని చేసే ఉద్యోగులందరూ దాదాపు ఓ వంద మంది వరకు ఈ ముద్రణ ప్రక్రియలో మునిగిపోతారు. తిరిగి లోక్సభలో ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం పూర్తయ్యేంత వరకు ఈ ఉద్యోగులంతా ప్రింటింగ్ ప్రెస్లోనే ఉంటారు.

అందరిపైనా నిఘానేత్రం...
మరోవైపు బడ్జెట్ ప్రతిపాదనలు ఏమాత్రం లీక్ అవకుండా చూసే బాధ్యతను ఇంటెలిజన్స్ విభాగం చూసుకుంటుంది. ఈ సమయంలో అవసరం మేరకు కొంతమంది ఉన్నతాధికారుల ఫోన్లు సైతం ట్యాపింగ్కు గురవుతాయి. అలాగే ఆర్థిక శాఖ కార్యాలయానికి వచ్చే సందర్శకులపై సీసీ టీవీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు నిఘా ఉంటుంది. ఈ కెమెరాల నిఘా పరిధిని దాటి వారు కుర్చీలపై కూర్చోడానికి కూడా అనుమతి ఉండదు.

అనుక్షణం నీడలా...
బడ్జెట్ పత్రాలను ముద్రించే ‘ప్రింటింగ్ ప్రెస్' సిబ్బందిని ఎవరితో సంబంధం లేకుండా ప్రత్యేకంగా ఉంచుతారు. వీరికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా అవసరమైన చికిత్స అందించేందుకు ఎల్లప్పుడూ వైద్యులు కూడా అందుబాటులో ఉంటారు. ముద్రణ విభాగం సిబ్బంది ఎవరైనా అత్యవసరంగా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే.. సదరు వ్యక్తి వెంట ఓ ఇంటెలిజెన్స్ అధికారి, ఓ పోలీసు ఉంటారు. వారు అనుక్షణం అతడిని నీడలా అనుసరిస్తారు.

రాష్ట్రపతి, ప్రధానికి ముందుగానే...
ఏటా బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టేముందే రాష్ట్రపతి, ప్రధానమంత్రికి ఆ ఏడాది బడ్జెట్ గురించి ఆర్థిక మంత్రి వివరిస్తారు. ఆ తరువాత బడ్జెట్ పత్రాలు ఉన్న బ్రీఫ్కేసుతో ఆర్థికమంత్రి పార్లమెంట్కు వస్తారు. స్పీకర్ ఆదేశాల మేరకు తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభిస్తారు.












Click it and Unblock the Notifications