కరోనా: ఐఏఎస్ కన్నన్పై సీరియస్ కేసు.. అడిగినా డ్యూటీలో చేరనందుకు కేంద్రం ప్రతీకారం..
ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూకాశ్మీర్ ప్రజల హక్కుల్ని కాలరాయడాన్ని నిరసిస్తూ ప్రభుత్వ సర్వీసుకు రాజీనామా చేసిన ఐఏఎస్ అధికారి కన్నన్ గోపీనాథన్పై కేంద్రం ప్రతీకార చర్యలకు దిగింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో తిరిగి విధుల్లో చేరాలంటూ కేంద్రం కోరినా, కన్నన్ తిరస్కరించడం తెలిసిందే. దీంతో ఆయనపై సీరియస్ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. రాజీనామాకు ముందు ఆయన పనిచేసన డయ్యూ డామన్ దాద్రానగర్ హవేలి (జనవరిలోనే ఈ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలను విలీనం అయ్యాయి) అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు శుక్రవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో దేశమంతటా అపిడమిక్ డిసీజ్ చట్టం, విపత్తు నిర్వహణ చట్టం అమలులోకి రావడం, అత్యవసర విభాగాల ఉద్యోగులు తప్పనిసరిగా విధులకు హాజరుకావాలని ఆదేశించడం తెలిసిందే. ఆగస్టు 21న రాజీనామా చేసే సమయానికి కన్నన్ దాద్రానగర్ హవేలీలో విద్యుత్ శాఖలో సెక్రటరీగా పనిచేశారు. రాజీనామాను ఇంకా ఆమోదించలేదు కనుక, అత్యవసర పరిస్థితుల దృష్ట్యా డ్యూటీలో చేరాల్సిందిగా ఈనెల 9న అధికారులు ఆయనకు కబురు పంపారు. అందుకు నిరాకరించిన కన్నన్.. ఇది ముమ్మాటికీ కేంద్రం కక్షసాధింపు చర్యేనన్నారు. స్వస్థలం కేరళలో ఉన్న ఆయన, కరోనాపై పోరులో ఒక వాలంటీర్ గా తనవంతు సాయం చేస్తానేతప్ప, డ్యూటీలో చేరబోనని ఆయన స్పష్టం చేశారు.

Recommended Video
అత్యవసర సమయంలో ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించిన కారణంగా కన్నన్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, రాజీనామాకు సంబంధించి గతంలోనూ ఆయనపై కేసు నమోదైందని దాద్రానగర్ పోలీసులు చెప్పారు. స్థానిక అధికారుల ఫిర్యాదు మేరకే చర్యలు తీసుకున్నామన్నారు. దాద్రా నగర్ హవేలీ డయ్యూడామన్ తోపాటు లక్ష్యద్వీప్ లోనూ ఇప్పటిదాకా ఒక్క కరోనా కేసు నమోదు కాలేదు. శుక్రవారం రాత్రి నాటికి దేశవ్యాప్తంగా కొవిడ్-19 కేసుల సంఖ్య 25వేలకు, మరణాలు 800కు చేరువయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 6,817 కేసులు, 301 మరణాలు చోటుచేసుకున్నాయి.












Click it and Unblock the Notifications