అక్కడికొస్తే పన్నీర్ చేయి నరుకుతా!: కళైరాజన్, 'శశికళకు మద్దతిస్తే అడుగు కూడా..'
'అన్నాడీఎంకె కార్యాలయాన్ని స్వాధీనం చేసుకోవడానికి వస్తే.. పన్నీర్ చేయి నరుకుతా' అంటూ కళైరాజన్ వ్యాఖ్యానించినట్టుగా వార్తలు వచ్చాయి.
చెన్నై: తమిళనాడు ఆపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంపై వివాదస్ప వ్యాఖ్యలు చేశారన్న కారణంగా పార్టీ చెన్నై జిల్లా శాఖ కార్యదర్శి కళైరాజన్ పై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నారు. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని అన్నారు.
అన్నాడీఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ, ఆపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మధ్య నడుస్తున్న హోరాహోరీ పోరులో కళైరాజన్ శశికళకు మద్దతునిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. 'అన్నాడీఎంకె కార్యాలయాన్ని స్వాధీనం చేసుకోవడానికి వస్తే.. పన్నీర్ చేయి నరుకుతా' అంటూ కళైరాజన్ వ్యాఖ్యానించినట్టుగా వార్తలు వచ్చాయి.
కొద్దిసేపట్లోనే ఈ వ్యాఖ్యలు తమిళనాడువ్యాప్తంగా వ్యాపించడంతో పలువురు కళైరాజన్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. దీంతో తన వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇచ్చుకోక తప్పలేదు. తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని, ఒకవేళ చేసి ఉంటే ఉపసంహరించుకుంటున్నానని తెలిపారు. తాను చేయని వ్యాఖ్యలకు తనపై పోలీసులకు ఫిర్యాదు చేయడం భావ్యం కాదని పేర్కొన్నారు.
మద్దతిస్తే అంతే..
ఒక్క అన్నాడీఎంకె పార్టీనే కాదు.. ప్రస్తుతం తమిళనాడు మొత్తం శశికళ-పన్నీర్ వర్గాలుగా విడిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రజల్లో ఇప్పటికే సానుభూతి పెంచుకున్న పన్నీర్ సెల్వంకు ఆయా నియోజకవర్గాల నుంచి బలమైన మద్దతు కనిపిస్తోంది. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా వెళ్లే ఎమ్మెల్యేలకు వారినుంచి హెచ్చరికలు ఎదురువుతున్నాయి.
తాజాగా తిరుప్పూరు నార్త్ ఎమ్మెల్యే విజయకుమార్, తిరుప్పూరు సౌత్ ఎమ్మెల్యే గుణశేఖరన్ లకు స్థానిక అన్నాడీఎంకే నేతలు, ప్రజలు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. తమ అభీష్టాన్ని లెక్క చేయకుండా శశికళకు గనుక మద్దతు తెలిపితే.. మళ్లీ నియోజకవర్గంలో అడుగుపెట్టలేరు అని హెచ్చరిస్తున్నారు.
పన్నీర్ సెల్వంకు మద్దతు ప్రకటించిన పక్షంలో తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అక్కడి ప్రజలు ఎమ్మెల్యేలను హెచ్చరించారు. అలా కాని పక్షంలో వచ్చే ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కదని హెచ్చరించారు.