వివాదంలో ఇరుక్కున్న సూపర్ స్టార్ రజనీ.. క్షమాపణ చెప్పాలని డిమాండ్..
సూపర్ స్టార్ రజనీకాంత్ వివాదంలో ఇరుక్కున్నారు. హేతువాది,నాస్తికుడు,ద్రవిడ ఉద్యమ పితామహుడు పెరియార్ రామస్వామిపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయన వ్యాఖ్యలను తప్పుపడుతూ ద్రవిడార్ విడుతలై కజగం(DK) అధ్యక్షుడు నెహ్రూదాస్ కోయంబత్తూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మతాల మధ్య రజనీ చిచ్చు పెడుతున్నారని ఆరోపిస్తూ.. ఐపీసీ సెక్షన్స్ 153ఏ,505 కింద కేసు నమోదు చేయాలని కోరారు. ఇంతకీ రజనీకాంత్ ఏమన్నారు..?

రజనీ ఏమన్నారు..
ఇటీవల చెన్నైలో ఏర్పాటు చేసిన తమిళ మేగజైన్ తుగ్లక్ 50వ వార్షికోత్సవ వేడుకలకు రజనీకాంత్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రసంగించిన రజనీకాంత్.. పెరియార్ గురించి ప్రస్తావించారు. 1971లో పెరియార్.. రాముడు,సీతల విగ్రహాలకు చెప్పుల దండ వేసి ఊరేగించారని అన్నారు. మూఢనమ్మకాలపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు సాలెంలో ఏర్పాటు చేసిన ఓ సదస్సులో భాగంగా పెరియార్ అలా చేశారని చెప్పుకొచ్చారు.

రజనీ క్షమాపణ చెప్పాలని డిమాండ్
పెరియార్పై రజనీకాంత్ వ్యాఖ్యలనుద్రవిడార్ విడుతలై కజగం తప్పుపట్టింది. రజనీ చెప్పినదాంట్లో ఇసుమంతైన నిజం లేదని చెప్పింది. రజనీకాంత్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని.. లేనిపక్షంలో ఆయన ఇంటిని, ఆయన నటించిన దర్బార్ సినిమా ప్రదర్శించబడుతున్న థియేటర్లను ముట్టడిస్తామని హెచ్చరించింది. కోయంబత్తూరు కమిషనర్కు ఆయనపై ఫిర్యాదు చేసింది.

స్పందించని రజనీ..
ద్రవిడార్ విడుతలై కజగం పెట్టిన కేసులపై రజనీకాంత్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. పెరియార్పై చేసిన వ్యాఖ్యలకు ఆయన కట్టుబడి ఉంటారా.. లేక ద్రవిడార్ సంస్థ డిమాండ్ మేరకు క్షమాపణలు చెబుతారా అన్న చర్చ జరుగుతోంది. త్వరలో రజనీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న తరుణంలో.. ఇలాంటి వివాదంలో ఇరుక్కోవడం చర్చనీయాంశంగా మారింది.

డీఎంకెపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు..
అదే కార్యక్రమంలో డీఎంకె అధికారిక పత్రిక మురసోలిపై రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి. 'మురసోలిని చదివే పాఠకులు చాలావరకు డీఎంకె కార్యకర్తలే. కానీ తుగ్లక్ మేగజైన్ను చదివేవాళ్లలో చాలామంది మేదావులు ఉంటారు' అని రజనీ వ్యాఖ్యానించారు. రజనీ వ్యాఖ్యలపై డీఎంకె కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాగా,తుగ్లక్ మేగజైన్ను రాజకీయ విశ్లేషకులు చో రామస్వామి స్థాపించారు. మేగజైన్ 50వ వార్షికోత్సవంలో రజనీకాంత్తో పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.












Click it and Unblock the Notifications