ముంబై ప్రముఖ మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం: రంగంలోకి దిగిన పది ఫైరింజిన్లు
ముంబై: ఇప్పటికే కరోనా మహమ్మారి విజృంభణతో కకావికలమవుతున్న దేశ ఆర్థిక రాజధాని ముంబైని అగ్నిప్రమాదాలు వెంటాడుతున్నాయి. గురువారం సాయంత్రం 6.15 గంటల ప్రాంతంలో ముంబై నగరంలోని అతిపెద్ద మార్కెట్ అయిన క్రాఫర్డ్ మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.
పండ్లు, కూరగాయల షాపులకు క్రాఫర్డ్ మార్కెట్ ప్రసిద్ధి. ఈ మార్కెట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో షాపుల యజమానులు, ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.
భారీగా ఎగిసిపడుతున్న మంటలను పది అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది తీవ్రంగా శ్రమించి ఆర్పివేశారు. ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్కు సమీపంలోనే ఈ మార్కెట్కు ఉండటంతో కొంత ఆందోళనకర వాతావరణం నెలకొంది. సమయానికి వచ్చి మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పివేయడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.
Mumbai: Fire breaks out at Crawford Market, 6 fire engines present at the spot pic.twitter.com/vPISXvXp2t
— ANI (@ANI) June 11, 2020
అయితే, అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కాగా, దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలోనే కరోనా కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. ముంబైలో మరింత ఎక్కువగా రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.