భారత్, టర్కిష్ సిబ్బందితో వెళ్తున్న 2 పడవల్లో అగ్ని ప్రమాదం, 11 మంది మృతి
న్యూఢిల్లీ/మాస్కో: భారత్, టర్కిష్, లిబియన్ క్రూ మెంబర్స్ను తీసుకు వెళ్తున్న రెండు షిప్ల్లో అగ్ని ప్రమాదం జరిగి 11 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. రష్యా నుంచి క్రిమియా ద్వీపకల్పాన్ని వేరు చేసే కెర్చ్ జలసంధి ప్రాంతంలో ప్రమాదం జరిగింది.
రెండు నౌకలు టాంజానియా జెండాలతో ఉన్నాయి. అందులో ఒక నౌక సహజ వాయువును మోసుకువెళ్తుండగా, మరొకటి ట్యాంకర్ నౌక. సమాచారం మేరకు సోమవారం ఒక నౌక నుంచి మరో నౌకలోకి ఇంధనం మార్చుతున్న సమయంలో మంటలు చెలరేగాయి.
ప్రమాదానికి గురైన క్యాండీ అనే నౌకలో 17 మంది సిబ్బంది ఉండగా, ఇందులో 9 మంది టర్కీ, 8 మంది భారత్ పౌరులు. మేస్ట్రో అనే మరో నౌకలో 15 మంది ఉండగా ఏడుగురు టర్కీ, ఏడుగురు భారతీయులు, ఒకరు లిబియాకు చెందినవారు.
ఓ నౌకలో పేలుడు సంభవించి మంటలు మరో నౌకకు విస్తరించినట్లుగా చెప్పారు. సహాయక చర్యల కోసం సిబ్బంది వెళ్లారు. ప్రమాదం జరగడంతో రెండు నౌకల్లోని ముప్పై మందికి పైగా సిబ్బంది సముద్రంలోకి దూకారు. వారిలో పన్నెండు మందిని సహాయక సిబ్బంది రక్షించి తీరానికి తీసుకొచ్చారు. 11మంది చనిపోయారని, మరో 9 మంది నావికుల ఆచూకీ తెలియాల్సి ఉంది. మృతుల్లో ఏ దేశం వారు ఎవరు ఉన్నారో తెలియాలి.