వెనక్కి తగ్గిన పాక్, సరిహద్దు వెంట బంకర్లు:సీఎం ఒమర్
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దులో పాక్ కాల్పుల విమరణ ఒప్పందాన్ని ఉల్లంఘించి గత తొమ్మిది రోజులుగా కాల్పులకు పాల్పడుతున్న పాకిస్దాన్ రేంజర్లు గురువారం రాత్రి నుంచి కాస్త వెనక్కి తగ్గినట్లు శుక్రవారం బీఎస్ఎఫ్ అధికార ప్రతినిధి తెలిపారు.
గురువారం రాత్రి నుంచి జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ), సాంబా జిల్లాలో దాడులకు పాల్పడలేదని అన్నారు. కతువా జిల్లాలోని 4 బీఎస్ఎప్ స్దావరాలపై మాత్రం ఉదయం 8 గంటల ప్రాంతంలో 29 నిమిషాల పాటు కాల్పులు జరిగాయని, కాల్పుల్లో ఎవ్వరికీ గాయాలు కాలేదని వెల్లడించారు.
గత తొమ్మిది రోజులుగా పాక్ రేంజర్ల కాల్పుల్లో 9 మంది మృతి చెందగా, 13 మంది భద్రత అధికారులు సహా సుమారు 90 మంది గాయపడ్డారు. ఐతే జమ్మూలోని సరిహద్దు గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకోని ఊళ్లను వదిలి వెళ్లిపోతున్నారు.

అంతర్జాతీయ సరహద్దు వెంబడి ఉన్న 133 గ్రామాలకు చెందిన సుమారు 30వేల మంది ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేశారు. 2003లో పాకిస్దాన్ పాల్పడిన కాల్పుల ఉల్లంఘనల కంటే ఎక్కవ తీవ్రంగా ఈసారి దాడులు ఉన్నాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
జమ్మూలో అంతర్జాతీయ సరిహద్దు రేఖ వెంబడి పాక్ కాల్పులకు కారణం ఆసియా గేమ్స్ లో భారత్ చేతిలో హాకీలో ఓడిపోవడమేనని బీఎస్ఎఫ్ అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కాశ్మీర్ సెక్టార్లో ఎప్పుడు ఎటువంటి పరిస్దితి ఎదురైనా ధీటుగా ఎదుర్కొనేందుకు సైన్యం సిద్దంగా ఉందని శ్రీనగర్ ఆర్మీ కమాండర్ సుబ్రతా సాహా తెలిపారు.
సరిహద్దు వెంబడి చొరబాటు యత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు. దాదాపు 180-200 మంది చొరబాటుదారులు సరిహద్దుగుండా ప్రవేశించేందుకు ఎదురు చూస్తున్నారన్నారు. సెప్టెంబర్ 1 నుంచి ఇప్పటి వరకు దాదాపు 18 మంది తీవ్రవాదులు మరణించినట్లు చెప్పారు.
ఇది ఇలా ఉంటే పాకిస్థాన్తో సరిహద్దులోని పరిస్థితిపై పాలకులు స్పందించాల్సిన అవసరం లేదని, సైనికులే దానికి బదులిస్తారని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. పాకిస్థాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించడాన్ని భారత్ దీటుగా, ధైర్యంగా ఎదుర్కొంటుందని చెప్పారు.
సరిహద్దులో త్వరలోనే అంతా సర్దుకుంటుందని బుధవారం ప్రధాని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీంతో, ప్రధాని ఈ విషయంలో సరిగ్గా స్పందిండచం లేదని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించాయి. అయితే, మోదీ వీటిని తిప్పికొట్టారు. గురువారం మహారాష్ట్రలోని బారామతిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ ప్రసంగిస్తూ... 'రోజులు మారాయని ప్రత్యర్థి గుర్తించాలి. వారి పాత అలవాట్లను ఇక ఎంత మాత్రమూ సహించం. నా అంతరంగమేంటో ప్రజలకు తెలుసు. ప్రత్యేకంగా వివరించి చెప్పాల్సిన పని లేదు. జవాన్లు స్పందించాల్సిన సమయం వచ్చినప్పుడు వారి వేళ్లు ట్రిగ్గర్పై పెట్టి మాట్లాడతారు.' అని అన్నారు.
అంతర్జాతీయ సరిహద్దు వెంబడి కమ్యూనిటీ బంకర్లు: సీఎం ఒమర్ అబ్దుల్లా
కాల్పుల విరమణ ఒప్పందానికి ఉల్లంఘిస్తూ పాకిస్తాన్ దాడులకు పాల్పడుతున్న తరుణంలో ప్రజలు బలి కాకుండా ఉండేందుకు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నారు. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న గ్రామాల్లో కమ్యూనిటీ బంకర్లను నిర్మించడం ద్వారా సామాన్యులను కాల్పుల బారి నుంచి రక్షించవచ్చని ఆయన భావించారు.
అనుకున్నదే తడవుగా సరిహద్దు వెంట ఉన్న గ్రామాల్లో కమ్యూనిటీ బంకర్లను నిర్మించాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏ సమయంలో పాకిస్దాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించి దాడులకు పాల్పడితే, గ్రామాల్లోని ప్రజలంతా బంకర్లో తలదాచుకుని ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications