Rohini Court News Video: ఢిల్లీ కోర్టులో పట్టపగలే కాల్పులు: గ్యాంగ్స్టర్ జితేందర్ మృతి: జడ్జి ముందే..!!
ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. పట్టపగలే ఢిల్లీ కోర్టులో గ్యాంగ్వార్ చోటు చేసుకుంది. ఢిల్లీలోని రోహిణీ కోర్టులో ఈ ఘటన చోటుచేసుకుంది. కోర్టు హాల్ నెంబర్ 207లో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గ్యాంగ్స్టర్ జితేంద్ర అలియాస్ గోగి మృతి చెందాడు. ప్రత్యర్థులు జరిపిన కాల్పల్లో జితేంద్ర మృతి చెందాడు. దుండగులు లాయర్ వేషధారణలో వచ్చి కాల్పులు జరిపారు. ఓ కేసు విషయమై జితేంద్ర అలియాస్ గోగి కోర్టుకు హాజరైన సమయంలో ప్రత్యర్థులు కాల్పులు జరిపారు.
కాల్పులు జరిగిన వెంటనే అలర్ట్ అయిన ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ కాల్పులు జరపడంతో ఇద్దరు దుండగులు మృతి చెందారు. మొత్తంగా నలుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది . మొత్తం 40 రౌండ్లు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మరికొందరు గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఇది గ్యాంగ్ వార్ కాదని, కాల్పలు జరిపిన వ్యక్తులపై వెంటనే పోలీసులు కాల్పులు జరిపి వారిని మట్టుబెట్టారని ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేష్ అస్తానా తెలిపారు.
ఈ కాల్పులపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. భద్రతాలోపాలు ఉన్నాయని పలువురు చెబుతున్నారు. కోర్టు బయట సరైన చెక్కింగ్ నిర్వహించలేదనే వాదన సైతం వినిపిస్తోంది. ఆగంతకులు ఎలా లోపలికి రాగలిగారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కాల్పులు శబ్దం వినపడటంతో కోర్టు ఆవరణ అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అక్కడి సిబ్బందికి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. కాల్పులు పరంపర కొనసాగడంతో లోపల ఉన్నవారికి ఏమౌతుందో అర్థంకాక బయటకు పరుగులు తీశారు. దీనిపై పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. దుండగులు ఎలా లోపలికి ప్రవేశించారు.. ఆయుధాలతో ఎలా రాగలిగారనే విషయాన్ని పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇదిలా ఉంటే కోర్టు ఆవరణలో అమర్చిన కెమెరాల్లో కాల్పుల దృశ్యాలు రికార్డు అయ్యాయి.
#WATCH | Visuals of the shootout at Delhi's Rohini court today
— ANI (@ANI) September 24, 2021
As per Delhi Police, assailants opened fire at gangster Jitender Mann 'Gogi', who has died. Three attackers have also been shot dead by police. pic.twitter.com/dYgRjQGW7J
ఇక నిందితులు పక్కా ప్రణాళికతోనే అటాక్ చేసినట్లు తెలుస్తోంది. గోగి కోర్టుకు హాజరవుతారనే ముందస్తు సమాచారం మేరకు ముందుగానే కోర్టు ఆవరణను రెక్కీ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నిందితులు లాయర్ వేషధారణలో వచ్చి కాల్పులు జరిపారని తెలుస్తోంది. అయితే కోర్టులోకి వీరు ఆయుధాలతో ఎలా ప్రవేశించారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
ప్రతి కోర్టు హాల్ ముందు మెటల్ డిటెక్టర్లు ఉండగా వాటిని తప్పించుకుని ఎలా ప్రవేశించగలిగారనేదానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. రెక్కీ నిర్వహిస్తున్న సమయంలోనే లోపలి వ్యక్తులు ఈ దుండగులకు సహకరించారా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇదిలా ఉంటే గ్యాంగ్స్టర్ జితేందర్ అలియాస్ గోగిపై ఢిల్లీ ప్రభుత్వం రూ.10 లక్షలు, హర్యానా ప్రభుత్వం రూ.10 లక్షలు మొత్తంగా రూ.20 లక్షలు రివార్డును గతంలో ప్రకటించడం జరిగింది.