Delta Plus variant: దేశంలో తొలి మృతి నమోదు.. జాగ్రత్తగా ఉండాలంటున్న నిపుణులు
భోపాల్: కరోనావైరస్ రోజుకో రూపం మారుస్తూ భయాందోళనకు గురిచేస్తోంది. ఫస్ట్ వేవ్లో ఒకలా, సెకండ్ వేవ్లో మరోలా మొత్తానికి ప్రజల ప్రాణాలు తీస్తోంది. తాజాగా మూడో వేవ్ వస్తోందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక భారత్లో డెల్టా ప్లస్ వేరియంట్ వైరస్ ప్రమాదకరంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్లో ఈ డెల్టా ప్లస్ వైరస్తో ఒకరు మృతి చెందారు. దీంతో భారత్లో తొలి డెల్టా ప్లస్ వేరియంట్ మృతి నమోదైంది. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో డెల్టాప్లస్ వేరియంట్తో ఒకరు మృతి చెందారు. అంతేకాదు ఇప్పటి వరకు డెల్టా ప్లస్ వేరియంట్కు సంబంధించి ఐదుకేసులు మధ్యప్రదేశ్లో గుర్తించారు. మూడు భోపాల్లో గుర్తించగా మరో రెండు ఉజ్జయిని జిల్లాలో కనుగొన్నారు.
ఇక డెల్టా ప్లస్ వేరియంట్ కోవిడ్కు చెందిన ప్రమాదకర వేరియంట్గా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్లో ఐదు డెల్టా ప్లస్ వేరియంట్ కేసులను గుర్తించడం జరిగిందని ఆ రాష్ట్ర వైద్య విద్య శాఖ మంత్రి విశ్వాస్ సారంగ్ తెలిపారు.ఇందులో ఒకరు మృతి చెందారని ధృవీకరించారు. ఇక ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోందని చెప్పుకొచ్చారు. మరో నలుగురు పేషెంట్లు కోలుకుంటున్నట్లు వెల్లడించారు. వారి నుంచి మే నెలలో శాంపిల్స్ సేకరించి జన్యుక్రమం చేయగా వారందరికీ డెల్టా ప్లస్ వేరియంట్ పాజిటివ్ సోకినట్లు నిర్థారణ అయ్యింది.
అయితే డెల్టా ప్లస్ వేరియంట్తో మృతి చెందిన మహిళకు వ్యాక్సిన్ ఇవ్వలేదు. ఆమె భర్త మాత్రం వ్యాక్సిన్ తీసుకున్నట్లు మంత్రి సారంగ్ వెల్లడించారు. తొలుత మృతురాలి భర్తకే కరోనా పాజిటివ్ వచ్చిందని ఆ తర్వాత మహిళకు సోకినట్లు డాక్టర్లు తెలిపారు. ఇప్పటికే భర్తకు రెండు డోసుల టీకా పూర్తయ్యిందని వెల్లడించారు.ఇక మిగతా నలుగురికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు మంత్రి స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలోని అన్ని హాస్పిటల్స్ అలర్ట్గా ఉండాలని సూచించినట్లు మంత్రి వెల్లడించారు. పరీక్షలు, జన్యు క్రమ ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు. ఎలాంటి జాప్యం లేకుండా పరీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి చెప్పారు. ప్రతి ఒక్కరూ వీలైనంత త్వరగా వ్యాక్సిన్ తీసుకోవాలని మంత్రి సారంగ్ పిలుపునిచ్చారు.