NRC రగడ: అక్రమవలసదారుల కోసం డిటెన్షన్ సెంటర్..కేంద్రం ఆదేశాలతోనేనా..?
బెంగళూరు: ఓ వైపు ప్రధాని నరేంద్ర మోడీ ఎన్ఆర్సీని దేశవ్యాప్తంగా అమలు చేయాలన్న నిర్ణయానికి రాలేదని చెబుతుంటే.. మరోవైపు అక్రమవలసదారుల కోసం నిర్బంధ కేంద్రాలు ప్రారంభమవుతున్నాయి. కర్నాటకలో తొలి నిర్బంధ కేంద్రంను ప్రభుత్వం ప్రారంభించింది. బెంగళూరుకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న నేలమంగళలో ఈ డిటెన్షన్ సెంటర్ను ప్రారంభించారు.

భారత్లో డిటెన్షన్ సెంటర్లు లేవని చెప్పిన ప్రధాని
నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ అంశంకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలోని రామ్లీలా మైదాన్లో ప్రసంగించారు. ఆ సమయంలో భారత్లో డిటెన్షన్ సెంటర్లు లేవని చెప్పారు. ప్రధాని చెప్పి రెండు రోజులు కూడా గడవక ముందే అక్రమ వలసదారుల కోసం డిటెన్షన్ సెంటర్ను ప్రారంభించినట్లు కర్నాటక సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కమిషనర్ పెద్దప్పయ్య చెప్పారు. ఇదే విషయాన్ని హోంశాఖలో పనిచేసే ఉన్నతాధికారి కూడా ఒకరు ధృవీకరించారు.

కేంద్రం ఆదేశాలతోనే డిటెన్షన్ సెంటర్
జనవరిలో డిటెన్షన్ సెంటర్ను ప్రారంభించాలని భావించారు అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందడంతో నిర్భంధ కేంద్రాన్ని ముందుగానే ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం.డిటెన్షన్ కేంద్రం ప్రారంభమై కొద్దిరోజులే కావడంతో ఇప్పటి వరకు ఎవరూ ఇక్కడ చేరలేదని సమాచారం. విదేశీ ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయం అక్రమవలసదారులను గుర్తించి నిర్భంధ కేంద్రంకు పంపుతుంది. అక్రమవలస దారులు ఇక్కడకు వస్తే వారికి అన్ని సదుపాయాలు కల్పిస్తామని పెద్దప్పయ్య చెప్పారు.

హాస్టల్ డిటెన్షన్ సెంటర్గా సోషల్ వెల్ఫేర్ హాస్టల్
ఓ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ను రాష్ట్ర ప్రభుత్వం డిటెన్షన్ కేంద్రంగా మార్చింది. ఇందులో ఆరుగదులు, ఒక కిచెన్, ఒక సెక్యూరిటీ గది ఉన్నాయి. మొత్తంగా ఇందులో 24 మంది ఉండే అవకాశం ఉంది. రెండు వాచ్ఓవర్లను నిర్మించారు. పెద్ద కాంపౌండ్ గోడను కూడా నిర్మించడం జరిగింది. 35 తాత్కాలిక డిటెన్షన్ కేంద్రాలను అన్ని జిల్లాల్లో గుర్తించినట్లు కర్నాటక ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టుకు తెలిపింది. ఇద్దరు అక్రమవలసదారుల బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం డిటెన్షన్ కేంద్రాల అంశాన్ని కోర్టుకు తెలిపింది.












Click it and Unblock the Notifications