ఫస్ట్ ఫోన్కాల్: జో బిడెన్తో మోడీ: కీలకాంశాలపై ఫోకస్: నాడు లంచ్: కమలా హ్యారిస్ గురించీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా కొత్త అధ్యక్షుడు జో బిడెన్కు ఫోన్ చేశారు. మంగళవారం రాత్రి ఆయనతో సంభాషించారు. బిడెన్ అగ్రరాజ్యాధినేతగా ఎన్నికైన తరువాత మోడీ ఆయనకు ఫోన్ చేయడం ఇదే తొలిసారి. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు ఆయనను అభినందించారు. పలు అంతర్జాతీయ అంశాలపై ఆయనతో చర్చించారు. ఇండో-ఆసియా పసిఫిక్, క్లైమెట్ ఛేంజ్ వంటి కీలకాంశాలపై వారిద్దరి మధ్య సుదీర్ఘంగా ఫోన్ సంభాషణ సాగినట్లు ప్రధానమంత్రి కార్యాలయం అధికారులు, అమెరికాలో భారత రాయబారి తరణ్జింత్ సింగ్ సంధు వేర్వేరుగా వెల్లడించారు.
వ్యూహాత్మక భాగస్వామ్యంపై..
మంగళవారం రాత్రి 11:30 గంటల సమయంలో నరేంద్ర మోడీ ఆయనకు ఫోన్ చేశారు. కొద్దిసేపటి తరువాత ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడికి ఫోన్ చేసి అభినందించినట్లు పేర్కొన్నారు. భారత్-అమెరికా మధ్య చాలాకాలం నుంచి కొనసాగుతూ వస్తోన్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని, దౌత్య సంబంధాల బలోపేతం చేసుకోవడం సహా ఇతర అంశాలపై చర్చించినట్లు వెల్లడించారు. ఇండో-పసిఫిక్ రీజియన్ దేశాల మధ్య సహకారాన్ని సాధించడం, వాతావరణ మార్పులు, కరోనా వంటి విషయాల్లో సాగిస్తోన్న ఉమ్మడి పోరాటాల గురించి ప్రస్తావించారు.
కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి.. రవాణా..
కరోనా వ్యాక్సిన్ను అభివృద్ధి, సరఫరా అంశాలు వారి మధ్య చర్చకు వచ్చాయి. ఏప్రిల్ నాటికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉండటం, దాన్ని చిట్టచివరి వ్యక్తి వరకూ ఎలా సరఫరా చేయాలనే విషయంపైనా మోడీ-బిడెన్ మధ్య సంభాషించారు. హెల్త్కేర్, ఫార్మాసూటికల్స్ రంగాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దీనిపై రెండు దేశాలు సమన్వయంగా పని చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
2014లో లంచ్..
భారత్-అమెరికా మధ్య దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై తాము చిత్తశుద్ధితో ఉన్నామని నరేంద్ర మోడీ ఈ సందర్భంగా జో బిడెన్కు హామీ ఇచ్చారని తరణ్జింత్ సింగ్ సంధు వెల్లడించారు. 2014లో నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు వెళ్లిన సమయంలో జో బిడెన్ ఆ దేశ ఉపాధ్యక్షుడిగా ఉన్నారని గుర్తు చేశారు. ఉపాధ్యక్షుడి హోదాలో బిడెన్.. నరేంద్ర మోడీ గౌరవార్థం ప్రత్యేకంగా విందును ఏర్పాటు చేశారని చెప్పారు. 20`6లో అమెరికా కాంగ్రెస్ను ఉద్దేశించి నరేంద్ర మోడీ ప్రసంగించారని, ఆ సమావేశానికి బిడెన్ అధ్యక్షుడిగా వ్యవహరించారని అన్నారు.
Recommended Video
కమలా హ్యారిస్ గురించి..
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి ముందే- ఆ ఇద్దరు నేతల మధ్య స్నేహ సంబంధాలు ఉన్నాయని చెప్పారు. భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ ఉపాధ్యక్షురాలిగా ఎన్నిక కావడం పట్ల మోడీ సంతోషాన్ని వ్యక్తం చేశారని సంధు చెప్పారు. ఆమె గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారని అన్నారు. కమలా హ్యారిస్ ఎన్నిక కావడం గర్వించదగ్గ అంశమని, భారత మహిళలు ఏ దేశంలో ఉన్నా అగ్రస్థానాన్ని అధిరోహిస్తారనడానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచారని మోడీ పేర్కొన్నట్లు తెలిపారు. ప్రతి మహిళకూ కమలా హ్యారిస్ ఆదర్శంగా నిలిచారని ప్రశంసించినట్లు తరణ్జింత్ సింగ్ సంధు పేర్కొన్నారు.