ఐదేళ్ల తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వంలో ముస్లిం వ్యక్తులకు మంత్రులుగా చోటు
ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వంలో ఐదేళ్ల తర్వాత ఎట్టకేలకు ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి మంత్రి పదవి దక్కింది. సోమవారం జరిగిన మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో ఉద్ధవ్ కేబినెట్లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నలుగురు ముస్లిం వ్యక్తులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన నలుగురు ముస్లిం వ్యక్తులు
సోమవారం అట్టహాసంగా జరిగిన ఉద్దవ్ థాక్రే కేబినెట్ విస్తరణలో ముస్లిం సామాజిక వర్గానికి ప్రాధాన్యత లభించింది. ఐదేళ్ల తర్వాత ప్రభుత్వంలో ఒక ముస్లిం వ్యక్తి మంత్రిగా ప్రమాణం చేయడం ఇదే తొలిసారి. గత ఫడ్నవీస్ ప్రభుత్వంలో ఒక్క ముస్లిం వ్యక్తికి కూడా మంత్రిగా చోటు దక్కలేదు. అయితే ఈ సారి మాత్రం నలుగురు ముస్లిం వ్యక్తులు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయడం ఆసక్తికలిగించింది. ఎన్సీపీ నుంచి నవాబ్ మాలిక్, హసన్ ముష్రిఫ్లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా... కాంగ్రెస్ నుంచి అస్లాం షేక్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.ఇక శివసేనకు చెందిన అబ్దుల్ సత్తార్ సహాయమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాదు ముస్లింలకు ఈ స్థాయిలో కేబినెట్ బెర్తులు దక్కడం కూడా ఇదే తొలిసారు.
2004లో ముగ్గురు ముస్లింలకు కేబినెట్లో చోటు
2004లో దివంగత ముఖ్యమంత్రి విలాస్ రావు దేశ్ముఖ్ ప్రభుత్వంలో ముగ్గురు ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారికి కేబినెట్ బెర్తు దక్కింది. ఇదిలా ఉంటే 1999 నుంచి 2003 వరకు ఉన్న దేశ్ముఖ్ ప్రభుత్వంలో ఏడుగురు ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా అందులో ఇద్దరికి మాత్రమే కేబినెట్ ర్యాంకింగ్ దక్కింది. మిగతా వారు సహాయమంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. ఇదిలా ఉంటే 1960లో మహారాష్ట్ర ఏర్పడ్డాక కేబినెట్లో ముస్లిం సామాజిక వర్గానికి ప్రాధాన్యత లేకుండా పోవడం ఒక్క ఫడ్నవీస్ ప్రభుత్వంలోనే జరిగింది. మహారాష్ట్రలో 11.5 శాతం ముస్లిం జనాభా ఉంది.
మహారాష్ట్ర ప్రభుత్వంలో ముస్లింలకు ప్రాధాన్యత ఇలా..
ప్రస్తుతం మహారాష్ట్ర అసెంబ్లీలో 10 మంది ముస్లిం ఎమ్మెల్యేలు ఉన్నారు. 2014లో 9 మంది ముస్లిం ఎమ్మెల్యేలు ఉండేవారు. 1995లో బీజేపీతో కలిసి శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమయంలో శివసేన పార్టీ నుంచి గెలిచిన ఏకైక ముస్లిం ఎమ్మెల్యే సబీర్ షేక్కు కేబినెట్లో చోటు దక్కింది.ఈ సారి మాత్రం అబ్దుల్ సత్తార్కు సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించింది శివసేన పార్టీ. 1960 నుంచి 2014 వరకు మొత్తం 64 మంది ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారు మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇందులో 31 మంది కేబినెట్ హోదాలో పనిచేయగా మరో 33 మంది సహాయమంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించారు.
మహారాష్ట్రలో మైనార్టీలకు ప్రాధాన్యత తక్కువే..
ఇదిలా ఉంటే మహారాష్ట్రలో మైనార్టీలకు ఎప్పుడూ సరైన ప్రాధాన్యత ఉండేది కాదు. ఉదాహరణకు అత్యంత ప్రభావితం చేసే పార్సీ సామాజిక వర్గం నుంచి 1995 తర్వాత ఇప్పటి వరకు ఒక్కరికి కూడా కేబినెట్లో చోటు దక్కకపోవడం ఆలోచింపజేస్తోంది. ఇక 1978 నుంచి ఇప్పటివరకు కేబినెట్లో క్రిస్టియన్ సామాజిక వర్గం వారికి చోటు దక్కలేదు.ఇదిలా ఉంటే జైన్ సామాజిక వర్గం నుంచి శివసేన పార్టీకి చెందిన రాజేంద్ర పాటిల్ యద్రాకర్కు కేబినెట్లో చోటు దక్కింది.