మహారాష్ట్రలో భారీ ఎన్కౌంటర్ .. ఐదుగురు మావోయిస్టుల మృతి , కొనసాగుతున్న కూంబింగ్
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఖురుకేడ తాలూకా కొబ్రమెండ అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య హోరాహోరీగా జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లుగా సమాచారం. ఇంకా కొబ్రామెండ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం గాలింపు కొనసాగుతోంది .
మీడియా వర్గాలు వెల్లడిస్తున్న సమాచారం ప్రకారం కొబ్రా మెండ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారని సమాచారం మేరకు పోలీసులు కూంబింగ్ ప్రారంభించారు. అటవీ ప్రాంతాన్ని పోలీసులు జల్లెడ పడుతున్న సమయంలో అటు పోలీసులు ,మావోలకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. హోరాహోరీగా జరిగిన ఎన్కౌంటర్ లో మొత్తం ఐదుగురు మావోయిస్టులు మరణించినట్లుగా సమాచారం. వీరిలో ఇద్దరు మహిళలు కాగా, ముగ్గురు పురుషులు ఉన్నారు.
కొబ్రామెండ అటవీ ప్రాంతంలో తప్పించుకున్న మావోయిస్టుల కోసం అదనపు బలగాలను రప్పించి మరీ పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. తప్పించుకున్న వారికోసం గాలింపు జరుగుతోందని, ఈ ఆపరేషన్లో అటవీ ప్రాంతంలో ఉన్న నక్సల్స్ ను విడిచిపెట్టేది లేదని అధికారులు చెబుతున్నారు. ఎన్ కౌంటర్ లో ఐదుగురు మృతి చెందగా మరికొంతమంది మావోయిస్టులకు తీవ్ర గాయాలు అయినట్లుగా అధికారులు వెల్లడిస్తున్నారు. ఇక రెండు రోజుల క్రితం కూడా కొబ్రామెండ అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగిన విషయం తెలిసిందే.