ఈ సారి బడ్జెట్లో ఐదు వ్యక్తిగత పన్నుల మార్పులను ఆశించొచ్చు
గురువారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఎన్డీఏ సర్కార్ తన చివరి బడ్జెట్ను శుక్రవారం ప్రవేశపెట్టనుంది. ఇక ఎన్నికల ముందు ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో మోడీ సర్కార్ మధ్యాదాయం ఉన్న కుటుంబాలకు, అంతకు మించి తక్కువగా ఆదాయం ఉన్న కుటుంబాలకు పన్ను విధానాల్లో ఊరట కలిగించాలని భావిస్తోంది. అయితే ట్యాక్స్ నిపుణులు మాత్రం ప్రత్యక్ష పన్నుల కోడ్ అమలు చేయనున్న నేపథ్యంలో ఇలా వరాలు ప్రకటించడం గందరగోళం సృష్టిస్తుందని అభిప్రాయపడుతున్నారు.
బేసిక్ ఇన్కంటాక్స్ మినహాయింపు పరిధి పెంపు ?
ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం తన చివరి బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశ పెట్టనుంది. ఇందుకోసం ఇప్పటికే ఆర్థికశాఖ మంత్రి పీయూష్ గోయల్ అంతా సిద్ధం చేసుకున్నారు. అయితే ఈ సారి మధ్యంతర బడ్జెట్లో బేసిక్ ఇన్కంటాక్స్ మినహాయింపు పరిధిని పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం. బేసిక్ ఇన్కంటాక్స్ మినహాయింపు పరిధిని ప్రస్తుతం ఉన్న రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు పెంచే అవకాశం ఉంది. ఈ పెంపు 60 ఏళ్ల వయస్సుకంటే తక్కువ ఉన్న వారికే వర్తిస్తుంది. ఇక 60 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వయసున్న వారికి బేసిక్ ఇన్కంటాక్స్ మినహాయింపు పరిధి రూ.3.5 లక్షలకు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం వారికి రూ.3లక్షలుగా ఉంది. ఇక పన్ను కట్టే మహిళలకు మరింత బేసిక్ ఇన్కంటాక్స్ మినహాయింపు పరిధి ఉండే అవకాశం ఉందని అది సీనియర్ సిటిజెన్స్ తో పాటు ఉండే అవకాశం ఉందని ట్యాక్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
సెక్షన్ 80 సీ కింద మినహాయింపు రూ.2లక్షలకు పెరిగే అవకాశం ?
ఇక సెక్షన్ 80(సి) కింద ఉన్న పరిధిని కూడా పెంచే అవకాశం ఉంది. సెక్షన్ 80సీ కింద రూ. 1.5 లక్షల మినహాయింపు ఉండగా.. 2014-15 బడ్జెట్లో దాన్ని కేంద్రప్రభుత్వం రివైజ్ చేసింది. అయితే మరోసారి రివైజ్ చేసే అవకాశం కనిపిస్తోందని నిపుణుల అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ పరిధిని పెంచితే టాక్స్ సేవింగ్స్కి మరింత వెసలుబాటు కల్పించినట్లు అవుతుంది.అయితే సెక్షన్ 80 సీ కింద మినహాయింపు రూ.2లక్షలకు పెరిగే అవకాశం ఉంది.
ఇన్కంటాక్స్ హేతుబద్ధీకరణ జరిగే అవకాశం
ఇక ఇన్కంటాక్స్లో కూడా హేతుబద్దీకరణ జరిగే అవకాశం ఉంది. రూ. 5లక్షల నుంచి రూ. 10 లక్షల ఆదాయం ఉన్నవారికి ప్రస్తుతం 5శాతం నుంచి 20శాతం వరకు ట్యాక్స్ విధించడం జరుగుతోంది. అయితే దీనిపై ప్రభుత్వం కాస్త ఆలోచన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. వ్యక్తిగత ఇన్కంటాక్స్ల పరిధిని 30శాతం నుంచి 25 శాతానికి కుదించే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం రూ. 2.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇస్తున్న కేంద్రం... ఆపై అంటే 2.5 నుంచి రూ. 5 లక్షలు ఉన్నవారికి 5శాతం, రూ. 5 లక్షల నుంచి 10 లక్షల ఉన్నవారికి 20 శాతం, ఇక 10 లక్షల పైన ఉన్నవారికి 30శాతం పన్ను విధించడం జరుగుతోంది.
గృహరుణాలపై ప్రయోజనాలు పెంపు
ఇక గృహరుణాలపై మరిన్ని ట్యాక్స్ బెనిఫిట్స్ ఇచ్చే ఆలోచనలో కేంద్రం ఉంది. గృహాల నిర్మాణంలో జాప్యం జరుగుతుండటం, వడ్డీ రేట్లు పెరిగిపోతుండటంపై కేంద్రం దృష్టి సారించాలని నిపుణులు చెబుతున్నారు. సొంత స్థలంలో ఇళ్లు నిర్మాణం చేసుకుంటున్నవారికి గృహరుణం పొందితే వడ్డీ రూ. 2లక్షలవరకు పరిమితి ఉంది. అయితే ఈ పరిమితిని రూ. 2.5 లక్షలకు పెంచుకునే వెసులుబాటు కల్పించే యోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది.
నేషనల్ పెన్షన్ స్కీము పై నిర్ణయం జరిగే అవకాశం
ఇక 2019 బడ్జెట్లో నేషనల్ పెన్షన్ స్కీమ్ పై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో ఎన్పీఎస్ విధానంలో కొన్ని మార్పులు చేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు డెలాయిట్ సంస్థకు చెందిన దివ్యబవేజా చెప్పారు. చేసిన మార్పులు అమల్లోకి ఏప్రిల్ 1 నుంచి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. గతేడాది డిసెంబర్ 6న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పన్ను మినహాయింపును పెంచాలన్న ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సాధారణంగా ఎన్పీఎస్ విధానంలో 60శాతం డబ్బులు తీసుకుంటే అందులో 40 శాతంపై ఎలాంటి పన్నువిధింపు ఉండేది కాదు. మరో 20శాతంపైనే పన్ను విధింపు ఉండేది.