Poll results: యూపీ సహా 4 రాష్ట్రాల్లో బీజేపీ, పంజాబ్లో ఆప్, ఎవరికెన్ని సీట్లంటే?
న్యూఢిల్లీ: దేశంలో ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయ దుంధుభి మోగించగా, ఒక రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ తిరుగులేని విజయం సాధించింది. ఉత్తరప్రదేశ్, మణిపూర్, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ జయకేతనం ఎగురవేసింది. పంజాబ్ రాష్ట్రంలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ దాదాపు క్లీన్ స్వీప్ చేసింది.
యూపీలో మరోసారి సీఎంగా యోగి ఆదిత్యనాథ్
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా రెండోసారి బీజేపీ అధికారం చేపడుతోంది. యూపీలో మొత్తం 403 స్థానాలు ఉండగా.. సాధారణ మెజార్టీకి 202 స్తానాలు అవసరం. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాల్లో 273 సీట్లను బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. దీంతో కమలం పార్టీకి తిరుగులేని విజయం లభించింది. ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీ 125 స్థానాల్లో గెలుపొందింది. బీఎస్పీ ఒకటి, కాంగ్రెస్ రెండు స్థానాల్లో విజయం సాధించాయి.
పంజాబ్ను క్వీన్ స్వీప్ చేసిన ఆప్
పంజాబ్ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ సరికొత్త రికార్డును నెలకొల్పింది. 2017లో 20 స్థానాలు గెలిచిన ఆప్.. ఈసారి ఏకంగా 92 స్థానాల్లో విజంయ సాధించింది. ఢిల్లీ మోడల్ మేనిఫెస్టోతో పంజాబ్ ఓటర్లను ఆకర్షించిన ఆప్.. కాంగ్రెస్, అకాళీదళ్ నేతలను చిత్తు చేసింది. సీఎంతోపాటు మాజీ సీఎంలు కూడా ఓటమిపాలయ్యారు. 117 స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీలో.. 92 స్థానాలను ఆప్ తన ఖాతాలో వేసుకుంది. గత ఎన్నికల్లో 77 సీట్లతో అధికారం చేపట్టిన కాంగ్రెస్.. ఈసారి 18 సీట్లకు పరిమితమైంది. ఎస్ఏడీ నాలుగు, బీజేపీకి 2 సీట్లు మాత్రమే వచ్చాయి.
ఉత్తరాఖండ్లో బీజేపీ ఘన విజయం
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించారు ఓటర్లు. దేవభూమిలో మొత్తం 70 నియోజకవర్గాలుండగా.. సాధారణ మెజార్టీ 36 స్థానాలు అవసరం. అయితే, బీజేపీ 47 స్థానాల్లో విజయఢంకా మోగించింది. అయితే, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి మాత్రం ఓటమిపాలయ్యారు. కాంగ్రెస్ పార్టీకి 19, ఇతరులకు 4 సీట్లు దక్కాయి.
బీజేపీ ఖాతాలోకే గోవా
గోవాలోనూ బీజేపీ రెండోసారి అధికారం చేపట్టనుంది. గోవాలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలుండగా.. బీజేపీకి 20 సీట్లు దక్కాయి. అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు ఒక్క సీటు మాత్రమే అవసరం. ఈ క్రమంలో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తామని ముందుకు వచ్చారు. దీంతో గోవాలో మరోసారి కాషాయ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఇక, కాంగ్రెస్ పార్టీకి 12 స్థానాలు, ఎంజీపీకి రెండు, ఆర్జీపీ ఒకటి, రెండు స్థానాల్లో ఆప్ గెలిచింది.
మణిపూర్లోనూ బీజేపీ జయకేతనం
మణిపూర్ రాష్ట్రంలోనూ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ సీట్లను బీజేపీ కైవసం చేసుకుంది. మణిపూర్ అసెంబ్లీ మొత్తం 60 స్థానాలుండగా.. ప్రభుత్వ ఏర్పాటుకు 31 స్థానాలు అవసరం. అయితే, బీజేపీ 32 స్థానాల్లో గెలిచి స్పష్టమైన మెజార్టీ సాధించింది. నేషనల్ పీపుల్స్ పార్టీ ఏడు స్థానాల్లో విజయం సాధించగా, జేడీయూ ఆరు స్థానాల్లో, కాంగ్రెస్ 5, ఇతరులు 10 స్థానాల్లో గెలుపొందారు. మణిపూర్ రాష్ట్రంలో కూడా కమలం పార్టీ రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది.