Wakf Bill: చంద్రబాబుకు వక్ఫ్ బిల్లు సంకటం-ముందు నుయ్యి, వెనుక గొయ్యి..!
మహారాష్ట్ర ఎన్నికల్లో సునామీ విజయంతో జోష్ లో ఉన్న ప్రధాని మోడీ కీలకమైన వక్ఫ్ బోర్డు చట్టం సవరణ బిల్లుపై దూకుడుగా ముందుకెళ్లేందుకు సిద్దమవుతున్నారు. మహారాష్ట్రలో గెలవగానే రాజ్యాంగంలో వక్ఫ్ కు చోటు లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోడీ.. ఈసారి పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఎలాగైనా ఈ బిల్లును ఆమోదింపచేసుకునేందుకు సిద్దమవుతున్నారు. ఇదంతా మోడీ సర్కార్ లో కీలక మిత్రపక్షమైన చంద్రబాబు పార్టీ టీడీపీకి సంకటంగా మారింది.
దేశంలో స్వాతంత్రం తర్వాత నుంచీ అమల్లో ఉన్న వక్ఫ్ బోర్డు చట్టాన్ని సవరించి భారీ ఎత్తున ఉన్న వక్ఫ్ భూముల్ని ప్రభుత్వ పరం చేసేందుకు మోడీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. చంద్రబాబు టీడీపీతో పాటు పలు ఎన్డీయే భాగస్వాములు, విపక్షాలు దీన్ని వ్యతిరేకించాయి. లోక్ సభలో ఎదురైన వ్యతిరేకతతో రాజ్యసభలో వక్ఫ్ బిల్లు పెట్టేందుకు సాహసించని కేంద్రం.. దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపింది.

ఇప్పుడు జేపీసీ పరిశీలన తర్వాత రిపోర్టు రావడంతో దీన్ని అడ్డుపెట్టుకుని మరోసారి లోక్ సభ ముందు ఈ బిల్లు తీసుకురాబోతున్నారు. అయితే ముస్లింల ప్రయోజనాలకు విరుద్ధంగా ఏమీ చేయనంటూ ఓట్లు వేయించుకున్న చంద్రబాబుకు ఇది ఇబ్బందికరంగా మారబోతోంది. ఇప్పటికే ఈ బిల్లుపై క్షేత్రస్దాయిలో మీటింగ్స్ పెట్టించి తమ వల్లే ఈ బిల్లు జేపీసీకి వెళ్లిందని ప్రచారం చేసిన టీడీపీ నేతలకు ఇప్పుడు పార్లమెంట్ లో ఏం చెప్పాలో తెలియని పరిస్ధితి. అలాగని బిల్లును వ్యతిరేకిస్తే మోడీ, షా ఆగ్రహానికి గురి కావడం ఖాయం. మరోవైపు వైసీపీ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీంతో చంద్రబాబు ఈ బిల్లుపై తీసుకునే వైఖరి ఆ పార్టీకి ఏపీలో రాజకీయంగా కీలకంగా మారింది.












Click it and Unblock the Notifications