సరదా అనుకుంటే ప్రాణమే పోయింది.. చెన్నైలో 'ఫుట్ బోర్డ్' విషాదం..
ఫుట్ బోర్డు ప్రయాణం చేస్తూ చెన్నైలో ముగ్గురు యువకులు మృతి చెందడం వారి తల్లిదండ్రులను శోకసంద్రంలో ముంచింది.
చెన్నై: ఫుట్ బోర్డు ప్రయాణం ప్రమాదకరమని ఎంత హెచ్చరించినా.. చాలామంది యువకులు ఆ మాటలను పెడచెవిన పెడుతున్నారు. సరదా పేరుతో ఫుట్ బోర్డు ప్రయాణాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
తాజాగా ఫుట్ బోర్డు ప్రయాణం చేస్తూ చెన్నైలో ముగ్గురు యువకులు మృతి చెందడం వారి తల్లిదండ్రులను శోకసంద్రంలో ముంచింది. పల్లవాన్ పాంగన్ సమీపంలోని సెయింట్ థామస్ మౌంట్ వద్ద ఎంఎంటీఎస్ లో ప్రయాణిస్తున్న ఏడుగురు ప్రయాణికులు ఫుట్ బోర్డు నుంచి అదుపు తప్పి కిందపడిపోయారు.
ఇందులో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతి చెందగా.. మిగతా ఐదుగురిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో యువకుడు కన్నుమూశాడు. మిగిలిన నలుగురి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, ఫుట్ బోర్డుపై ప్రయాణిస్తున్న సమయంలో రైలు పట్టాల పక్కనే ఉన్న ఎలక్ట్రిక్ స్తంభాన్ని వీరు ఢీకొన్నారు. దీంతో మొత్తం ఏడుగురు యువకులు కిందపడిపోగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.