కాంగ్రెస్ పోరాటం అసాధారణం: ఎట్టకేలకు మోకరిల్లక తప్పని బీజేపీ?
Recommended Video

బెంగళూరు: ఈమధ్య కాలంలో ఇంత రాజకీయ ఉత్కంఠను రేకెత్తించిన సందర్భం మరొకటి లేదు. 2014నుంచి బీజేపీ ముందు మోకరిల్లుతూనే వచ్చిన కాంగ్రెస్.. ఈసారి మాత్రం అసాధారణ రీతిలో పోరాడింది.
రాహుల్ నాయకత్వం పనిచేయకపోయినా.. గులాంనబీ ఆజాద్, డీకే శివకుమార్, సిద్దరామయ్య వంటి నేతలే మొత్తం తమ భుజాలపై వేసుకుని నడిపించారు. చివరాఖరి దాకా ఎక్కడ పట్టు వీడకుండా.. ఎమ్మెల్యేలు జారిపోతున్నారన్న ప్రచారం నేపథ్యంలో.. ఎక్కడా నిరాశకు లోనవకుండా.. బీజేపీపై మొండిగా పోరాడారు.

చివరకు గత నాలుగేళ్లలో ఎన్నడూ లేనివిధంగా బీజేపీ కాంగ్రెస్ పోరాటం ముందు చేతులెత్తేయక తప్పలేదు.తెరవెనుక బీజేపీ సాగించిన బేరసారాల ఆడియో టేపులను ఎప్పటికప్పుడు లీక్ చేయించి.. వాటికి విస్తృత ప్రచారం కల్పించి బీజేపీని బద్నాం చేయడంలో కాంగ్రెస్ విజయం సాధించింది.
ఇక ఇంతకన్నా దిగజారితే బాగుండదన్న ఆలోచనతో ఎట్టకేలకు బీజేపీ తన మనసు మార్చుకోక తప్పలేదు. రాజీనామాతో ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టి బలనిరూపణలో విఫలమయ్యారని యడ్యూరప్ప ప్రకటించడం ఈమధ్య కాలంలో కాంగ్రెస్ సాధించిన గొప్ప విజయమనే చెప్పాలి.
గతంలో గోవా, మణిపూర్ ఎన్నికల సమయంలో లాగా ఏమాత్రానికి అలసత్వానికి తావు ఇవ్వకుండా కాంగ్రెస్ కర్ణాటకలో జాగ్రత్తపడింది. ఎన్నికల ఫలితాలు రావడమే ఆలస్యం.. జేడీఎస్ తో జతకట్టి బీజేపీకి పెద్ద షాక్ ఇచ్చింది.
అది మొదలు ఎమ్మెల్యేలను కాపాడుకోవడం దగ్గరి నుంచి.. విశ్వాసపరీక్ష వరకు వాళ్లంతా తమ వెంటే ఉండేలా చూసుకోవడంలో అత్యంత చాకచక్యంగా వ్యవహరించింది.
మరీ ముఖ్యంగా అర్థరాత్రి సుప్రీం తలుపులు తట్టి కాంగ్రెస్ చాలావరకు విజయం సాధించింది. బలనిరూపణను 15రోజుల నుంచి అమాంతం కుదించేయడంతో బీజేపీ ఉక్కిరిబిక్కరైపోయింది. ఎమ్మెల్యేల బేరసారాలకు దిగినా ఫలితం లేకపోయింది. మరోవైపు ఎమ్మెల్యేలు జారిపోతున్నారని, మాతో టచ్ లోకి వచ్చారని బీజేపీ చెబుతున్న మాటలకు కాంగ్రెస్ లొంగిపోలేదు. అదంతా మైండ్ గేమ్ అని పసిగట్టి తన పని తాను చేసుకుపోయింది.
చివరకు కమలదళాన్ని నిలువరించడంలో విజయం సాధించింది. దీంతో ఈ సాయంత్రం సంబరాలు చేసుకుంటామన్న యడ్యూరప్ప మాట తలకిందులైంది. సంబరాలు మొదలయ్యాయి.. అయితే అవి కాంగ్రెస్ శిబిరంలో.












Click it and Unblock the Notifications