కాంగ్రెస్కు కంపౌండర్ వైద్యమే కావాలి: రాహుల్పై గులాం నబీ ఆజాద్ విసుర్లు, మోడీపై ఇలా
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీని వీడిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఆ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత తొలిసారి స్పందించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మరోసారి కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. తాను బలవంతంగానే పార్టీని వీడాల్సి వచ్చిందన్నారు.
సీనియర్ల సలహాలు బుట్టదాఖలే: కాంగ్రెస్పై ఆజాద్ ఫైర్
కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం కొరవడుతోందని గులాం నబీ ఆజాద్ అన్నారు. మోడీ అనేది కేవలం కారణం మాత్రమే. జీ23 నేతలతో కలిసి నేను పార్టీ అధిష్టానానికి లేఖ రాసినప్పటి నుంచే నాకు, పార్టీకి మధ్య విభేదాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ అధిష్టానం తమనెవరూ ప్రశ్నించకూడదని అనుకుంటారన్నారు. ఎన్నోసార్లు కాంగ్రెస్ సమావేశాలు జరిగాయని, అయితే, తాము ఇచ్చే ఏ ఒక్క సలహాను కూడా వారు తీసుకోలేదని అసహనం వ్యక్తం చేశారు. అందుకే తట్టుకోలేక ఆ లేఖ రాసినట్లు తెలిపారు.
కాంగ్రెస్కు డాక్టర్ కాదు, కంపౌండర్ వైద్యమేనంటూ ఆజాద్
అంతేగాక, ఆ లేఖ రాయడానికి ముందూ, తర్వాత ఆరు రోజులపాటు తాను నిద్రలేని రాత్రులు గడిపానని గులాంనబీ ఆజాద్ తెలిపారు. రాజీనామా చేయాలని తాను ఎన్నడూ అనుకోలేదని, కానీ, తన ఇంట్లో నుంచి తానే బలవంతంగా వెళ్లిపోయేలా చేశారని ఆజాద్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి లోపాలను సరిదిద్దుకునే సమయం లేదు. ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నవారంతా ఎందుకూ పనికిరారు. రాష్ట్ర అధ్యక్షులు పార్టీ సభ్యులను ఏకం చేయాల్సింది పోయి.. వారు పార్టీని వీడేలా చేస్తున్నారు. మూలుగుతున్న కాంగ్రెస్.. డాక్టర్ నుంచి కాకుండా కంపౌండర్ నుంచి మందులు తీసుకుంటోందన్నారు.
కాంగ్రెస్ కుప్పకూలడం ఖాయమన్న ఆజాద్: రాహుల్పైనా విమర్శలు
కాంగ్రెస్ పార్టీ పునాదులు బలహీనపడుతున్నాయని, ఏ క్షణమైన కూలిపోయే ప్రమాదం ఉందని ఆజాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, 30 ఏళ్ల క్రితం సోనియా గాంధీపై ఎలాంటి గౌరవం ఉందో ఇప్పుడు కూడా ఆమెను అలాగే గౌరవిస్తున్నానని ఆజాద్ అన్నారు. ఇందిరాగాంధీ కుటుంబ వారసుడిగా.. రాజీవ్-సోనియా కుమారుడిగా రాహుల్ ను కూడా అంతే గౌరవిస్తున్నానని చెప్పారు. రాహుల్ గాంధీని విజయవంతమైన నేతగా చేయాలని అనుకున్నామని, కానీ ఆయన అంత ఆసక్తి చూపించలేదని తెలిపారు. రాహుల్ గాంధీ మంచి వ్యక్తే కానీ, రాజకీయ నాయకుడు కాదని అన్నారు.
ప్రధాని మోడీపై గులాం నబీ ఆజాద్ ప్రశంసలు: బీజేపీలో చేరికపై..
మరోవైపు, ఆజాద్ ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీపై ఆయన ప్రశంసలు కురిపించారు. మోడీ చాలా కఠినమైన మనిషి అని మొదట తాను అభిప్రాయపడ్డానని అన్నారు. కానీ, ప్రధాని మోడీ చాలా మానవతావాది అని కొనియాడారు. అయితే, బీజేపీలో చేరుతున్నారా? అని ప్రశ్నించగా.. తాను బీజేపీలో చేరడం లేదని స్పష్టం చేశారు ఆజాద్. ఆ నిర్ణయం జమ్మూకాశ్మీర్లో తన రాజకీయాలకు ఏ మాత్రం ఉపయోగపడదని, ఇది కేవలం ప్రచారం మాత్రమేనని తేల్చిచెప్పారు.