అస్సాం మాజీ ముఖ్యమంత్రి భూమిధర్ బర్మన్ కన్నుమూత, ప్రధాని, సీఎం సంతాపం
దిస్పూర్: అస్సాం మాజీ ముఖ్యమంత్రి భూమిధర్ బర్మన్(91) ఆదివారం కన్నుమూశారు. దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గౌహతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. సీనియర్ కాంగ్రెస్ నేత అయిన బర్మన్.. రెండు సార్లు అస్సాం ముఖ్యమంత్రిగా పనిచేశారు.
1931లో జన్మించిన భూమిధర్ బర్మన్.. 1996లో ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. 2010లో తరుణ్ గొగోయ్ శస్త్ర చికిత్స కోసం ముంబై వెళ్లిన సమయంలో రెండోసారి ముఖ్యమంత్రిగా పనిచేశారు బర్మన్.
హితేశ్వర్ సైకియా, తరుణ్ గొగొయ్ ప్రభుత్వాలలో ఆరోగ్య, విద్య, రెవెన్యూ శాఖల మంత్రిగా సేవలందించారు. 1967లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన భూమిధర్ బర్మన్.. ఏడుసార్లు శాసనసభకు ఎన్నికై ప్రజలకు సేవలందించారు.
Anguished by the passing away of former Assam CM and senior politician, Shri Bhumidhar Barman. My thoughts are with his family and supporters in this hour of grief: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 18, 2021
నల్బరి వెస్ట్, ధర్మపూర్, బర్ఖేట్రీ నియోజకవర్గాలు ఆయన ప్రాతినిథ్యం వహించారు బర్మన్. వృత్తిరీత్యా వైద్యుడైన బర్మన్.. అస్సాం మెడికల్ కాలేజీ నుంచి మెడికల్ పట్టా పొందారు. బర్మన్ మరణం పట్ల కాంగ్రెస్, బీజేపీ, ఇతర రాజకీయ పార్టీల నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
అస్సాం ప్రభుత్వం మూడు రోజులపాటు సంతాప దినాలను ప్రకటించింది. భూమిధర్ బర్మన్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బర్మన్ కు రాష్ట్ర కాంగ్రెస్ ఘన నివాళులర్పించింది. మంచి రాజకీయ నేతతోపాటు వైద్యుడిని కూడా కోల్పోయామని పేర్కొంది.
Saddened to learn about the demise of former Chief Minister of Assam Dr. Bhumidhar Barman.
— Sarbananda Sonowal (@sarbanandsonwal) April 18, 2021
My sincere condolences to his bereaved family members and well-wishers. Om shanti. pic.twitter.com/Zj1SkRPZ1Y
అస్సాం ఒక సమర్థవంతమైన రాజకీయ నేతను కోల్పోయిందని ముఖ్యమంత్రి, బీజేపీ నేత శర్బానంద సోనోవాల్ ఒక ప్రకటనలో తెలిపారు. అస్సాం ప్రజల కోసం ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు. ఒక మంచి రాజకీయ నేతను కోల్పోయామని మంత్రి హిమంత బిశ్వ శర్మ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. తన రాజకీయ జీవితంలో బర్మన్.. ఎన్నో అసాంఘిక శక్తులతో పోరాడారని సీనియర్ కాంగ్రెస్ నేత, ఎంపీ ప్రద్యుత్ బర్డోలొయి కొనియాడారు. భూమిధర్ బర్మన్ తనయుడు దిగాంత బర్మన్ కాంగ్రెస్ టికెట్పై బర్ఖెట్రీ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.