బిజెపి ఓడితే పాక్లో దీపావళి: సుశీల్ కుమార్
పాట్నా: బీహార్ ఎన్నికల్లో బీజేపీ నాయకులు రోజుకో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీని చూస్తే పాకిస్థాన్, చైనా దేశాలు గడగడలాడుతాయని బీహార్ బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
బీహార్ ప్రజలు మోడీని బలపరచాలని, ఇక్కడ బీజేపి అధికారంలోకి రావడానికి పూర్తిగా సహకరించాలని సుశీల్ కుమార్ మోడీ మనవి చేశారు. ప్రధాని మోదీ నాయకత్వాన్ని బీహార్ ప్రజలు బలపరుస్తారనే నమ్మకం తనకు వచ్చిందని అన్నారు.
నరేంద్ర మోడీ ప్రధాని అయిన తరువాత పాకిస్థాన్, చైనా ప్రభుత్వాలు భయపడుతున్నాయని పదేపదే అన్నారు. బీహార్ లో బీజేపీ గెలిస్తే భారతదేశంలో అంతా దీపావళి చేసుకుంటారని చెప్పారు. అదే బీహార్ లో బీజేపీ ఓడిపోతే పాకిస్థాన్ లో దీపావళి చేసుకుని సంబరాలలో మునిగిపోతారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
బీహార్ లో బీజేపీ ఓడిపోతే పాకిస్థాన్ లో టపాకాయలు పేల్చి సంబరాలు చేసుకుంటారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో బీజేపీ నేత సుశీల్ కుమార్ మోడీ సైతం ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల సమయంలో నరేంద్ర మోదీకి బీహార్ గుర్తుకు వచ్చిందని, ఇప్పుడు చూస్తే బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని ఆర్జేడీ, జేడీయూ నాయకులు మండిపడ్డారు. బీజేపీ నాయకుల మీద ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి వారి మీద చర్యలు తీసుకోవాలని మనవి చేస్తామని అంటున్నారు.