Gali Janardhan Reddy: మైనింగ్ కింగ్ కొత్త పార్టీ- తెర వెనుక మద్దతు : బీజేపీ నెక్స్ట్ స్టెప్..!?
Gali Janardhan Reddy: ఊహించిందే జరిగిది. ఎన్నికల వేళ కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మైనింగ్ కింగ్ బీజేపీకి రాజీనామా చేసారు. సొంత పార్టీని ప్రకటించారు. కొద్ది రోజులుగా గాలి జనార్ధన రెడ్డి సొంతంగా పార్టీ ఏర్పాటు చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. దీనిని నిజంగా చేస్తూ ఈ రోజు గాలి జనార్ధన రెడ్డి కళ్యాణ రాజ్య ప్రగతి పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీతో తనకు ఉన్న అనుబంధాన్ని వివరించారు. గాలి జనార్ధనరెడ్డికి మద్దతుగా నిలచేదెవరు. తెలుగు రాజకీయాలపై ప్రభావం ఉంటుందా...
బీజేపీకి రాజీనామా - కొత్త పార్టీ ప్రకటన
కర్ణాటక రాజకీయాల్లో గాలి జనార్ధన రెడ్డి కొత్త పార్టీని ప్రకటించారు. ఎన్నికలకు బీజేపీ వర్సస్ కాంగ్రెస్ అన్నట్లుగా పోటీ మారిన వేళ గాలి తన నిర్ణయం ప్రకటించారు. ఇంత కాలంగా కొనసాగుతూ వచ్చిన బీజేపీని వీడుతున్నట్లు వెల్లడించారు. బీజేపీతో తన అనుబంధం గాలి జనార్ధన రెడ్డి వివరించారు. కళ్యాణ రాజ్య ప్రగతి పేరుతో సొంత పార్టీతో ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు వెల్లడించారు. మరో అయిదు నెలల్లో కర్ణాటక లో ఎన్నికలు జరగనున్న వేళ గాలి జనార్ధన రెడ్డి తన నిర్ణయం ప్రకటించారు. కొద్ది రోజులుగా కర్ణాటకలోనూ వైసీపీ విస్తరణ దిశగా కార్యాచరణ సిద్దం అవుతోందంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. కానీ, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల దీని పైన స్పష్టత ఇచ్చారు. ఏపీలో మినహా ఏ రాష్ట్రంలోనూ పార్టీ ఆలోచన లేదని చెప్పారు. తాజాగా సీఎం జగన్ తాను ఏపీకే పరిమితమని కడప జిల్లాలో తేల్చి చెప్పారు. గాలి జనార్ధన రెడ్డి గతంలోనూ పార్టీ ఏర్పాటు చేసి ఆ తరువాత బీజేపీలో విలీనం చేసారు.
ఇటు గాలి ..అటు సీఎం కేసీఆర్
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆ రాష్ట్రం పైన ఫోకస్ పెట్టారు. అక్కడ బీజేపీ - కాంగ్రెస్ కు వ్యతిరేకంగా జేడీఎస్ ను గెలిపిద్దామని తాజాగా పార్టీ సమావేశంలో పిలుపునిచ్చారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లొ పోటీ చేస్తామని వెల్లడించారు. అక్కడ బీఆర్ఎస్ కు ఆదరణ ఉందన్నారు. ఇప్పుడు గాలి జనార్ధన రెడ్డి కొత్త పార్టీ ద్వారా తన శక్తి చాటుకొనే ప్రయత్నాలు ప్రారంభించారు. గాలి ప్రారంభించిన పార్టీ పేరు..లక్ష్యం ఆసక్తిగా మారుతోంది. గతంలో హైదరాబాద్ కర్ణాటకగా ఉన్న ప్రాంతం కావటంతో పాటుగా.. తెలుగు రాష్ట్రాలతో సంబంధాలు కలిగిన వారు ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నారని చెబుతున్నారు. దీంతో, ఇప్పుడు గాలి జనార్ధన్ రెడ్డి కొత్త పార్టీ బీఆర్ఎస్ అంచనాలను దెబ్బ తీస్తుందా.. లేక, బీఆర్ఎస్ ఆ పార్టీకి చెక్ పెడుతుందా.. ఈ రెండు పార్టీలు ఎవరి ఓట్ బ్యాంక్ పైన ప్రభావం చూపుతాయనే చర్చ సాగుతోంది.
గాలి ఆకస్మిక నిర్ణయం - బీజేపీ ఏం చేయబోతోంది
హైదరాబాద్ కర్ణాటకగా ఉన్న ప్రాంతం ఇప్పుడు కల్యాణ కర్ణాటకగా మారింది. కల్యాణ కర్ణాటకలో బళ్లారి, రాయచూరు, యాదగిరి, కలబురగి(గుల్బర్గా) కొప్పళ, విజయనగర జిల్లాల పరిధిలో 48 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇప్పుడు గాలి జనార్ధన రెడ్డి ఈ ప్రాంతం కేంద్రంగానే వచ్చే ఎన్నికలకు సిద్దం అవుతున్నారు. కొప్పల్ జిల్లాలోని గంగవతి నియోజకవర్గం నుంచి గాలి జనార్ధన రెడ్డి అసెంబ్లీ బరిలో దిగటం ఖాయంగా కనిపిస్తోంది. ఇక, బీఆర్ఎస్ - గాలి జనార్ధన రెడ్డి కొత్త పార్టీ రెండూ దాదాపుగా ఒకే ప్రాంతం పైన ప్రధానంగా ఆధారపడుతున్నట్లు కనిపిస్తోంది. ఇక, పార్టీ వీడి కొత్త పార్టీ ఏర్పాటు చేసిన గాలి జనార్ధన రెడ్డి నిర్ణయం పైన బీజేపీ ఏ రకంగా స్పందిస్తుందనేది చూడాల్సి ఉంది. కర్ణాటకలో తిరిగి గెలుపే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తుంది. ఈ సమయంలో గాలి జనార్ధనరెడ్డి నిర్ణయం ఎవరికి మేలు చేస్తుంది.. ఎవరికి నష్టం చేస్తుందనే విశ్లేషణలు మొదలయ్యాయి.