బీజేపీ మాజీ ఎమ్మెల్యే అక్రమ సంబంధం, విడాకులు ఇవ్వాలని !
బెంగళూరు: కర్ణాటక బీజేపీ నాయకులలో ప్రముఖుడైన చిక్కమగళూరు జిల్లా మూడిగెరె మాజీ ఎమ్మెల్యే ఎంపీ. కుమారస్వామి కుటుంబ గొడవ మళ్లీ రచ్చ అయ్యింది. ఎంపీ. కుమారస్వామి తన భార్య సవితాతో విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించారు.
మైసూరు జేఎంఎఫ్ సీ కోర్టులో ఎంపీ. కుమారస్వామి తన భార్యతో విడాకులు కోరుతూ పిటీషన్ దాఖలు చేశారు. తనకు విడాకులు ఇవ్వాలంటే తనకు భరణం చెల్లించాలని ఆయన భార్య సవితా కూడా కోర్టును ఆశ్రయించారు.
తనకు విడాకులు ఇస్తే రూ. 2.50 కోట్ల ఆస్తి, నెలకు రూ. 1.50 లక్షలు భరణం చెల్లించాలని, కోర్టు ఖర్చుల కింద మరో రూ. 5 లక్షలు చెల్లించాలని సవితా కూడా కోర్టులో మరో పిటీషన్ దాఖలు చేశారు. కుమారస్వామి, సవితాలకు సర్దిచెప్పడానికి వారి కుటుంబ సభ్యులు ప్రయత్నించారు.
అయితే కుమారస్వామి తన భార్యకు విడాకులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని, ఆయన ఇప్పుడు ఎవ్వరిమాట వినరని ఆయన అనుచరులు అంటున్నారు. మొత్తం మీద బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుమారస్వామి తన దాంపత్యానికి చెక్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
గత సంవత్సరం జూన్ 23వ తేదిన సవితా తన భర్త కుమారస్వామిని చూడటానికి బెంగళూరులోని వికాస సౌధకు వచ్చారు. ఆ సమయంలో కుమారస్వామి రెచ్చిపోయి నీ మొఖం నాకు చూపించకు అంటూ నడిరోడ్డు మీద భార్య సవితా మీద దాడి చేశారు.
తరువాత సవితా బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యే ఎంపీ. కుమారస్వామికి హాసన్ కు చెందిన మహిళతో అక్రమ సంబంధం ఉందని, అందుకే ఆరు నెలల నుంచి తన ఇంటికిరాలేదని, ప్రేమ వివాహం చేసుకుని మోసం చేశాడని ఆయన భార్య సవితా అప్పట్లో ఆరోపించారు.