పోలీస్ స్టేషన్లలో జయలలిత ఫోటోలు తొలగింపు: ఆస్థానంలో !
చెన్నై: తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఫోటోలు తొలగింపు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. బుధవారం నాటికి దాదాపు అన్ని పోలీస్ స్టేషన్లలో జయలలిత ఫోటోలు తొలగించారు.
ఐ ఫోన్ లాంటి అమ్మకు ఓటు వేస్తే డబ్బా ఫోన్ లాంటి చిన్నమ్మనా: సెగ!
అక్రమార్జన కేసులో సుప్రీం కోర్టు జయలలితను నేరస్థురాలిగా ప్రకటించడంతో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఆమె ఫోటోలు వాడరాదంటూ డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే. స్టాలిన్ మద్రాసు హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ముందడుగు వేసిన పోలీస్
చెన్నై నగరంతో సహ తమిళనాడులోని అన్ని జిల్లాల్లోని పోలీస్ స్టేషన్ లలో ఉన్న జయలలిత ఫోటోలను తొలగించే పనిలోపడ్డారు. బుధవారం నాటికి దాదాపుగా తమిళనాడులోని అన్ని పోలీస్ స్టేషన్లలో అమ్మ ఫోటోలు తొలగించారు.
న్యాయస్థానంలో ఉందని
జయలలిత ఫోటోలకు సంబంధించిన వివాదం ప్రస్తుతం హైకోర్టులో ఉండటంతో నేరస్తులపై కఠిన చర్యలు తీసుకునే అధికారం కలిగిన పోలీస్ స్టేషన్లలో ఆమె ఫోటో ఉంటే భవిష్యత్తులో కోర్టు పరంగా చిక్కులు ఎదురౌతాయేమోనని పోలీసు అధికారులు ఆమె ఫోటోలను తొలగిస్తున్నారు.
సచివాలయంలో జయలలిత ఫోటోలు
ప్రస్తుత సచివాలయం సహ ప్రభుత్వ కార్యాలయాల్లో గోడోలపైనే కాకుండా మంత్రులు, అధికారులు టేబుళ్లపై జయలలిత ఫోటోలు దర్శనం ఇస్తున్నాయి. అయితే వారు కూడా త్వరలో జయలలిత ఫోటోలు తొలగించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని న్యాయనిపుణులు అంటున్నారు.
అమ్మ ఫోటో, చిన్నమ్మ ఫోటోలు కాదు
జయలలిత ఫోటోలు తొలగించిన పోలీసు అధికారులు ఆ స్థానంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి ఫోటోలు తగిలిస్తున్నారు. చెన్నై నగర పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఇప్పటికే జయలలిత ఫోటోలు పూర్తిగా తొలగించారు.
మాకు ఎవ్వరూ చెప్పలేదు
జయలలిత ఫోటోలు తొలగించే విషయంపై పోలీసు అధికారులు మీడియాతో మాట్లాడుతూ పాలకులు, హోం శాఖ ఉన్నతాధికారుల నుంచి తమకు ఎలాంటి ఉత్తర్వులు రాకపోయినా తమంతట తామే జయలలిత ఫోటోలు తొలగిస్తున్నామని వివరించారు. అయితే ఈ విషయంలో చిన్నమ్మ ప్రియశిష్యుడు సీఎం పళనిసామి, ఆయన మంత్రి వర్గ సభ్యులు మాత్రం స్పంధించకపోవడం కొసమెరుపు.