ఆ సంచలన కేసులో దోషిగా మాజీ ముఖ్యమంత్రి: 18న శిక్ష ఖరారు: సీబీఐ కోర్టు
రాంచీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దాణా కుంభకోణం కేసు- ముగింపు దశకు వచ్చేసినట్టే. ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలను ఎదుర్కొంటోన్న బిహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ సీనియర్ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ దోషిగా తేలారు. దాణా కుంభకోణంతో ముడిపడి ఉన్న అయిదు కేసుల్లోనూ ఆయనను దోషిగా నిర్ధారించింది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం. కొద్ది సేపటి కిందటే తన తుది నిర్ణయాన్ని వెలువడించింది. ఈ నెల 18వ తేదీన లాలూ ప్రసాద్ యాదవ్కు శిక్ష ఖరారు చేయనుంది.
1996లో తొలిసారిగా..
ఈ కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్ ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రిగా పని చేసిన సమయంలో బిహార్లో చోటు చేసుకున్న ఈ దాణా కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 1996లో తొలిసారిగా ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. పశుసంవర్ధక శాఖపై అధికారులు నిర్వహించిన దాడుల సందర్భంగా ఈ కుంభకోణాన్ని గుర్తించారు. ఈ కుంభకోణం విలువ 950 కోట్ల రూపాయలు.
అయిదు కేసుల్లో దోషిగా..
ఈ కుంభకోణంపై సీబీఐ అధికారులు దర్యాప్తు చేపట్టారు. లాలూ ప్రసాద్ను నిందితుడిగా గుర్తిస్తూ 1997 జూన్లో ఛార్జ్షీట్ను నమోదు చేశారు. లాలూతో పాటు బిహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా పేరును ఇందులో చేర్చారు. లాలూ ప్రసాద్పై మొత్తం అయిదు కేసులు నమోదయ్యాయి. ఈ అయిదింట్లోనూ ఆయన దోషిగా తేలారు. దొరండా ట్రెజరీ నుంచి 139.50 కోట్ల రూపాయలను విత్డ్రా చేసినట్లు రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తాజాగా నిర్ధారించింది.
వివిధ ట్రెజరీల నుంచి..
దీనితో దాణా కుంభకోణంలో నమోదైన అయిదు కేసుల్లోనూ లాలూ ప్రసాద్ యాదవ్ దోషిగా తేలినట్టయింది. ఛాయ్బాసా ట్రెజరీ నుంచి రెండు విడతల్లో రూ.37.7 కోట్లు, 33.13 కోట్లు, దేవ్గఢ్ ట్రెజరీ నుంచి రూ.89.27 కోట్లు, దుమ్కా ట్రెజరీ నుంచి 3.76 కోట్ల రూపాయలను పశువుల దాణాను కొనుగోలు చేయడానికి విత్డ్రా చేశారని, ఆ మొత్తాన్ని మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయా కేసులన్నింట్లోనూ లాలూను దోషిగా తేల్చింది న్యాయస్థానం.
18న శిక్ష ఖరారు..
ఆయనకు ఇంకా శిక్షను ఖరారు చేయాల్సి ఉంది. ఆయనకు ఏ శిక్ష విధించాలేది ఈ నెల 18వ తేదీన ఖరారు చేస్తామని రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి తెలిపారు. తొలి నాలుగు కేసుల్లో 14 సంవత్సరాల జైలుశిక్ష పడింది. లాలూ యాదవ్ ఇప్పటికే జైలు శిక్షను అనుభవించారు. అనారోగ్య కారణాలతో సీబీఐ న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు. అయిదు కేసు- దొరండా ట్రెజరీ విత్డ్రా విచారణకు ఆయన ఇవ్వాళ రాంచీలోని సీబీఐ న్యాయస్థానానికి హాజరయ్యారు. న్యాయమూర్తి తన ఆదేశాలను వినిపించే సమయంలో లాలూ న్యాయస్థానంలోనే ఉన్నారు.