యూకో బ్యాంకు మాజీ ఛైర్మెన్ అరుణ్కౌల్పై సిబిఐ కేసు నమోదు, రూ.737 కోట్ల దుర్వినియోగం
హైదరాబాద్: పంజాబ్ నేషనల్ బ్యాంకు ఉదంతం మర్చిపోకముందే తాజాగా మరో బ్యాంకులో నిబంధనలకు విరుద్దుంగా రుణాలను మంజూరు చేసిన విషయం వెలుగు చూసింది. ఈ మేరకు యూకో బ్యాంకు మాజీ ఛైర్మెన్, అరుణ్ కౌల్పై సిబిఐ కేసు నమోదు చేసింది.
బ్యాంకులు నిబంధనలకు విరుద్దంగా ఏ రకంగా రుణాలను మంజూరు చేశారనే విషయమై ఇటీవల కాలంలో అనేక ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా యూకో బ్యాంకులో ఈ తరహ ఘటన వెలుగుచూసింది.
యూకో బ్యాంకులో నిబంధనలకు విరుద్దంగా ఏరా ఇన్ఫ్రా ఇంజనీరింగ్కు రుణాలను మంజూరు చేశారనే ఆరోపణలపై ఆ బ్యాంకు మాజీ ఛైర్మెన్ ,సీఎండి అరుణ్కౌల్పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఎరా ప్రమోటర్లు బ్యాంకు చైర్మెన్తో కుమ్మకై బ్యాంకు నుండి తీసుకొన్న రుణాలను తమ స్వంత ఖాతాల్లోకి మళ్ళించుకొన్నారని అభియోగాలు నమోదయ్యాయి.
నిందితుల ఇళ్ళు, కార్యాలయాలపై సీబిఐ అధికారులు దాడులు నిర్వహించారు. ఎరా ఇన్ఫ్రా ఇంజనీరింగ్ ఇండియా (ఇఐఈల్) సిఎండి హేమ్సింగ్ భరానా, చార్టర్డ్ అకౌంట్లు పంకజ్ జైన్, వందనా శారదా, ఆల్టీస్ ఫిన్సర్వ్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన పవన్ బన్సాల్పై కూడా సిబిఐ అభియోగాలు దాఖలు చేసింది. ఈ బ్యాంకు నుండి సుమారు రూ.650 కోట్లను స్వాహ చేసినట్టు సిబిఐ అనుమానిస్తుంది.
రుణాలను తీసుకొన్నట్టుగా సృష్టించి ఆ డబ్బులను స్వంత ఖాతాలకు మళ్ళించుకొన్నారని సిబిఐ గుర్తించింది. ఏ లక్ష్యం కోసం రుణాలను తీసుకొన్నారో ఆ లక్ష్యం నెరవేరకుండా నిందితులు వ్యవహరించారని సిబిఐ అభిప్రాయపడింది. ఇతర అవసరాల కోసం తీసుకొన్న రుణాలను మళ్ళించారని సీబిఐ గుర్తించింది.
2010-15 మధ్య కాలంలో సిఎల నుండి తప్పుడు డాక్యుమెంట్లను సృష్టించి బ్యాంకును మోసగించారని సిబిఐ అభియోగాలను నమోదు చేసింది ఆ సమయంలో బ్యాంకు ఛైర్మెన్గా కౌల్ ఎరా ఇంజనీరింగ్ సంస్థకు సహకరించారని సిబిఐ అభిప్రాయపడింది.
రూ 650 కోట్లు ఇలా..
2010 లో ఎరా ఇన్ఫ్రా రెండు విడతల్లో రూ. 650 కోట్ల రుణాన్ని యూకో బ్యాంకు నుండి తీసుకొంది. రెండు విడతలుగా యూకో బ్యాంకు నుండి ఈ రుణాన్ని ఎరా ఇన్ఫ్రా ఇంజనీరింగ్ సంస్థ తీసుకొంది ఈ రుణాన్ని ఇతర అవసరాలకు వాడుకొన్నట్టుగా సిబిఐ గుర్తించింది. వాస్తవాలను సిఎ తొక్కిపెట్టారని కూడ సిబిఐ ఆరోపిస్తోంది. అయితే ప్రస్తుతం ఈ రుణం వడ్డీతో కలిపితే సుమారు రూ.737 కోట్లకు చేరుకొంది.బ్యాంకుల నుండి రుణాలు తీసుకొన్న మొండి పద్దుల్లో ఎరా ఇన్ఫ్రా ఇంజనీరింగ్ సంస్థ పేరు కూడ ఉంది. ఆర్బీఐ ఇటీవల ఈ జాబితాను విడుదల చేసింది. 12 మొండి పద్దుల జాబితాలో ఎరా ఇన్ఫ్రా సంస్థ పేరు కూడ ఉంది. సుమారు రూ10 వేల కోట్లు బకాయిలున్నాయని ఆర్బీఐ ప్రకటించింది.