కాంగ్రెస్ పార్టీకి షాక్-బీజేపీకి బూస్ట్!: ఈ నెలాఖరులోగా కాషాయ పార్టీలో చేరనున్న హార్దిక్ పటేల్
గాంధీనగర్: కాంగ్రెస్ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్, పటీదార్ ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్ మే 30 లేదా మే 31న గాంధీనగర్లో బీజేపీలో చేరనున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.ఈ మేరకు జాతీయ మీడియా ఛానల్ ఏబీపీ కథనం ప్రచురితం చేసింది. కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత.. తాను బీజేపీలో చేరడం లేదని హార్దిక్ పటేల్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు మాత్రం ఆయన కాషాయ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
బీజేపీలో చేరనున్న హార్దిక్ పటేల్.. ఏక్తాయాత్ర
బీజేపీలో చేరిన తర్వాత సోమనాథ్ ఆలయం నుంచి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వరకు ఏక్తా యాత్రకు కూడా పటేల్ నాయకత్వం వహించనున్నారు.కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ, పర్షోత్తమ్ రూపాల సమక్షంలో హార్దిక్ పటేల్ కాషాయ పార్టీలో చేరనున్నారు. ఓ టీవీ చానెల్లో జరిగిన కార్యక్రమంలో హార్దిక్ పటేల్ వచ్చే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు కూడా సూచించినట్లు ఐఏఎన్ఎస్ తెలిపింది. అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనేది పార్టీ నిర్ణయిస్తుందని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీపై విమర్శలు దాడి కొనసాగిస్తున్న హార్దిక్ పటేల్
హార్దిక్ పటేల్.. మే 18న కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి పటేల్ వివిధ వేదికలపై కాంగ్రెస్పై విమర్శల దాడి చేశారు. కాంగ్రెస్ పార్టీని "పాటిదార్ వ్యతిరేకి, గుజరాత్ వ్యతిరేకి" అని వ్యాఖ్యానించారు. 2015లో గుజరాత్లో పాటిదార్ సామాజిక వర్గానికి రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ హార్దిక్ పటేల్ ఆందోళనకు నేతృత్వం వహించిన తర్వాత వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. జూలై 2020లో ఆయన గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు.
హిందువులంటే కాంగ్రెస్ పార్టీకి ఎందుకంత ద్వేషం: హార్దిక్ పటేల్
కాంగ్రెస్ పార్టీకి.. హిందువులన్నా.. హిందూ దేవతలన్నా ఎందుకంత ద్వేషమని ఈ వారం ప్రారంభంలో మండిపడ్డారు హార్దిక్ పటేల్. "ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని, హిందూ మత విశ్వాసాలను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తుందని నేను ఇంతకుముందు కూడా చెప్పాను అని వరుస ట్వీట్లలో హార్దిక్ పటేల్ అన్నారు. శ్రీరాముడితో మీకు ఎలాంటి శత్రుత్వం ఉందని నేను కాంగ్రెస్, దాని నాయకులను అడగాలనుకుంటున్నాను? హిందువులను ఎందుకు అంతగా ద్వేషిస్తారు? శతాబ్దాల తర్వాత, అయోధ్యలో శ్రీరాముని ఆలయాన్ని నిర్మిస్తున్నారు, అయినప్పటికీ కాంగ్రెస్ నాయకులు దీన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. శ్రీరాముడికి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారు అని కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నేతలపై హార్దిక్ పటేల్ ధ్వజమెత్తారు.
కొందరు విదేశాల్లో ఆనందిస్తారంటూ హార్దిక్ పటేల్ చురకలు
దేశంలోని కొన్ని కీలక సమస్యలపై కాంగ్రెస్ "రోడ్బ్లాక్ పాత్రను మాత్రమే పోషించింది", "కేవలం ప్రతిదానిని వ్యతిరేకించే స్థాయికి దిగజారిపోయింది" అని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపిన తన రాజీనామా లేఖలో హార్దిక్ పటేల్ ఆరోపించారు.గుజరాత్ ప్రజల సమస్యలను తాను లేవనెత్తినప్పుడల్లా, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తమ మొబైల్ ఫోన్లలో సందేశాలను తనిఖీ చేయడంలో బిజీగా ఉన్నారని, పార్టీకి, దేశానికి అవసరమైనప్పుడు కొంతమంది నాయకులు "విదేశాలలో ఆనందిస్తున్నారు" అని హార్దిక్ పటేల్.. పరోక్షంగా రాహుల్ గాంధీని కూడా విమర్శించారు.