కేసీపీ గ్రూప్ అధినేత, ఫిక్కీ మాజీ అధ్యక్షుడు వీఎల్ దత్ కన్నుమూత
చెన్నై: ప్రముఖ వ్యాపారవేత్త, కేసీపీ సంస్థల అధినేత, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫిక్కీ) మాజీ అధ్యక్షుడు వెలగపూడి లక్ష్మణదత్(82) కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. లక్ష్మణదత్కు భార్య ఇందిరా దత్, కుమార్తె కవిత ఉన్నారు.
డిసెంబర్ 27, 1937జన్మించారు వెలగపూడి లక్ష్మణ్ దత్(వీఎల్ దత్). ఆయన మద్రాసు తెలుగు సమాఖ్య ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. రాష్ట్ర పారిశ్రామికీకరణలోనూ ఆయన పాత్ర చెప్పుకోదగినదే. కృష్ణా జిల్లా ఉయ్యూరు, గుంటూరు జిల్లా మాచర్ల, చెన్నైలో కేసీపీ పరిశ్రమలను ఆయన స్థాపించారు. 1989లో ఆయనకు ప్రభుత్వం యాజమాన్య రత్న పురస్కారంతో గౌరవించింది. 1991లో నాగార్జున యూనివర్సిటీ డాక్టర్ ఆఫ్ లెటర్స్ డిగ్రీని ప్రదానం చేసింది. ఆయన గతంలో ఫిక్కీ అధ్యక్షుడిగానూ వ్యవహరించారు.

తీరని లోటంటూ ఉపరాష్ట్రపతి
భారత పారిశ్రామిక రంగానికి వీఎల్ దత్ మరణం తీరని లోటని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. మరణవార్త తెలిసిన అనంతరం ఆయన కుటుంబసభ్యులకు ఫోన్ చేసి పరామర్శించారు వెంకయ్య. గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్య రంగాల్లో వీఎల్ దత్ సేవలు మరవేలమన్నారు. అంతర్జాతీయ వాణిజ్యం, పెట్టుబడుల విధానంలో ఆయన నిష్ణాతుడని ప్రశంసించారు. వీల్ దత్ మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర సంతాపం తెలిపారు. ఆయన సేవలను కొనియాడారు.
Recommended Video

టీఆర్ఎస్ సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు.. వీఎల్ దత్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుధవారం చెన్నై వెళ్లి నివాళులర్పిస్తానని చెప్పారు. ఫిక్కీ అధ్యక్షురాలు సంగీతా రెడ్డి మాట్లాడుతూ.. పారిశ్రామిక రంగానికి వీఎల్ దత్ ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. ఆయన లేని లోటు తీరనిదని అన్నారు. పారిశ్రామిక రంగానికి, ప్రభుత్వాలకు ఆయన ఒక వారధిలా ఉండేవారని కొనియాడారు.












Click it and Unblock the Notifications